జగిత్యాల, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ విభాగంలో 2021 సంవత్సరానికి గాను జగిత్యాల జిల్లా వెయ్యికి వెయ్యి మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ భారత్ మిషన్ విభాగం గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 గ్రామీణ విభాగాలకు సంబంధించిన అవార్డులను ప్రకటించింది. స్వచ్ఛత విభాగంలో జగిత్యాల జిల్లా ద్వితీయ స్థానాన్ని పొందినట్లు భారత గ్రామీణ అభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ విభాగం అధికారులు ప్రకటించారు. 2014 సంవత్సరం నుంచి దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, స్వచ్ఛత, పచ్చదనం వృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.
స్వచ్ఛభారత్ మిషన్ విభాగం కింద స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ, స్వచ్ఛ సర్వేక్షణ్ అర్బన్ విభాగాల్లో పరిశుభ్రత, స్వచ్ఛత, పచ్చదనానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ, గ్రామీణాభివృద్ధి మంచినీటి సరఫరా శాఖలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్నాయి. స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో ప్రతి ఏడాది ప్రత్యేక కృషి చేసిన గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ర్టాలను గుర్తించి, వాటికి అవార్డులను ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 2021 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ విభాగంలో వంద శాతం (మాక్సిమమ్ 1000) మార్కులను సాధించి జాతీయ స్థాయిలో జగిత్యాల ద్వితీయ స్థానాన్ని సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం జగిత్యాల ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లా తృతీయ స్థానంలో ఉండగా, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది.
మూడు కేటగిరీల్లో పరిశీలన..
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ విభాగంలో మూడు ప్రధాన విభాగాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛత, పరిశుభ్రత, పచ్చదనానికి సంబంధించి ఆ ఏడాది చేపట్టిన కార్యక్రమాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పరిశీలన, ప్రజాభిప్రాయ సేకరణ, స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణలో పురోగతి అంటూ మూడు అంశాల ఆధారంగా ఇటీవల సర్వే చేశారు. ఇందులో క్షేత్రస్థాయి పరిశీలనకు 300 మార్కులు, ప్రజల అభిప్రాయాలకు 350 మార్కులు, స్వచ్ఛత కార్యక్రమాల పురోగతికి 350 మార్కులను కేటాయించారు. ప్రజా అభిప్రాయ విభాగంలో వ్యక్తిగత మరుగుదొడ్లు అందుబాటులో ఉంచినందుకు 40 మార్కులు, ఘన వ్యర్థాల నిర్వహణ 40, ద్రవ వ్యర్థాల నిర్వహణకు 40, పరిశుభ్రతలో మెరుగైన పరిస్థితికి 15. ద్రవ, ఘన వ్యర్థాల నిర్వహణకు 15 మార్కులు కేటాయించారు.
ప్రజాభిప్రాయం (స్వచ్ఛ భారత్ యాప్లో పౌరుల పార్టిసిపేషన్)కు 50 మార్కులు కేటాయించారు. ఇక ప్రజలు ఇచ్చే ప్రధాన సమాచారానికి సైతం 150 మార్కులు కేటాయించారు. మొత్తంగా ప్రజాభిప్రాయానికి 350, క్షేత్ర స్థాయి పరిశీలనకు 300 మార్కులు కేటాయించారు. ఇందులో గృహాలకు సంబంధించిన అంశంలో వ్యక్తిగత మరుగుదొడ్ల అందుబాటుకు 35 మార్కులు, నిరంతర మరుగుదొడ్డి వినియోగానికి 35 మార్కులు, సురక్షితంగా ఘన వ్యర్థాల తొలగింపునకు 30 మార్కులు, సురక్షిత ద్రవ వ్యర్థాల తొలగింపునకు 30 మార్కులు, వ్యక్తిగత పరిశుభ్రతకు 20 మార్కులు ఇచ్చారు. గ్రామానికి సంబంధించిన ఘనవ్యర్థాల నిర్వహణకు 10, ద్రవ వ్యర్థాల తొలగింపునకు 20, ఘన వ్యర్థాల తొలగింపునకు 15, వ్యర్థాల సేకరణ, సెగ్రిగేషన్ ఏర్పాట్లకు 10 మార్కులు, మానవ వ్యర్థాల తొలగింపు తదితర అంశాలకు మార్కులు కేటాయించారు.
వీటితో పాటు ప్రజా సమూహ క్షేత్రాల్లో శానిటేషన్ సౌకర్యాలు, నిల్వ నీటి తొలగింపు తదితర అంశాలకూ మార్కులు కేటాయించారు. 350 మార్కులతో కీలకమైన స్వచ్ఛత కార్యక్రమాల పురోగతి అంశాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ విభాగంలో ఫైనాన్షియల్ వృద్ధి, ఓడీఎఫ్ వెరిఫికేషన్, స్వచ్ఛ భారత్ పనుల్లో ప్రజల భాగస్వామ్యం, ఘన, ద్రవ వ్యర్థాల తొలగింపు, ఓడీఎఫ్ ప్లస్ కార్యక్రమాలకు 200 మార్కులు కేటాయించారు. ఇక ఇదే విభాగంలో జిల్లా స్థాయి అధికారుల నివేదికలు, ప్రణాళికలకు 150 మార్కులు కేటాయించారు. జిల్లా స్థాయి వార్షిక అమలు ప్రణాళిక, 15వ ఫైనాన్స్ నిధులు, లక్ష్యాలు, ఓడీఎఫ్ ప్లస్ విభాగం అవగాహన, బేస్లైన్ సర్వే, శానిటేషన్ ఫండ్ కేటాయింపు, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, ఘన, ద్రవ వ్యర్థాల తొలగింపులో సిబ్బంది అంకితభావం తదితర అంశాలకు ఈ మార్కులను కేటాయించారు. ఈ మూడు విభాగాల్లో కలిపి 1000 మార్కుల ఆధారంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 సర్వే నిర్వహించారు.
జిల్లాలో 26 గ్రామాల్లో సర్వే..
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2021 సంవత్సరానికిగాను 26 గ్రామాల్లో జాతీయ బృందాలు సర్వే నిర్వహించాయి. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్కు సంబంధించిన మూడు ప్రధాన కేటగిరిల్లోని అన్ని అంశాలను బృందాలు పరిశీలించి, అభిపాయ్రాలను సేకరించాయి. గ్రామాల్లోని నివా స గృహాలతో పాటు పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, డంపింగ్యార్డులు, మురుగు కాలువలు, ఘన, ద్రవ వ్యర్థాల తొలగింపు, సెగ్రిగేషన్ షెడ్స్ తదితర అన్ని విభాగాలను పరిశీలించారు. దీంతో పాటు జిల్లా అధికారులు సైతం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేకు సంబంధించిన సర్వేలో జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చేయడంలో కృతకృత్యులయ్యారు.
అలాగే జిల్లాకు సంబంధించి సరైన వార్షిక ప్రణాళికను జాతీయ స్థాయి పరిశీలన బృందాల ముందు ప్రదర్శించగలిగారు. సమష్టి కృషి నేపథ్యంలో జగిత్యాల జిల్లా వందశాతం మార్కులతో జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. జిల్లా ఇంతటి అరుదైన ఘనత సాధించడంపై మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సుంకె రవిశంకర్, చెన్నమనేని రమేశ్బాబు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత హర్షం వ్యక్తం చేశారు. సమష్టి కృషితో జాతీయ స్థాయి అవార్డు సాధించిన అధికారుల బృందానికి, సహకరించిన ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాను అగ్రస్థానం వైపు నడిపిస్తున్న పాలానాధికారి గుగులోత్ రవి, ఇతర అధికారులను అభినందించారు. కాగా ఈ అవార్డులను కలెక్టర్, డీఆర్డీఓలు అక్టోబర్ 2, గాంధీ జయంతిన రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించనున్నారు.