కరీంనగర్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ధాన్యం కొనుగోళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని, వాటిని అడ్డుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన గురువారం నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రి గంగుల హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు శాఖలపై జరిగిన చర్చలో పాల్గొని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఇవ్వడంతో అధిక దిగుబడులు వస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సాగు నీరు, 24 గంటల విద్యుత్, పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు అందిస్తుండడంతో లక్షల ఎకరాల్లో బంగారు పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. రైతులు సంతోషంగా ఉండడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
పండించిన ధాన్యం గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంఎస్పీ ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. మన పంటలను చూసి కేంద్రం కడుపు, కండ్లు మండించుకుంటోందని, రైతులు పండించే దిగుబడులపై అనేక ఆంక్షలు పెడుతోందన్నారు. చివరికి ధాన్యం కొనుగోళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే కుట్రలు చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ జడ్పీ సమావేశంలో తీర్మానం చేయాలని మంత్రి ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మాన ప్రతిని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు కిలో బియ్యం రూ. 33కు కొనుగోలు చేసి కార్డుదారులకు రూపాయికే అందిస్తుంటే కొందరు దుర్వినియోగం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ను ఆదేశించారు.
టాస్క్ఫోర్స్ బృందాలు పకడ్బందీగా పని చేసేలా చూడాలన్నారు. ప్రజలు కూడా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని కోరారు. హుజూరాబాద్ డివిజన్లోని కొన్ని గ్రామాల్లో ఎస్సీ కాలనీలకు రాత్రి సమయాల్లో అధికారులు కరెంట్ కట్ చేస్తున్నారని పలువురు సభ్యులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో సంబంధిత అధికారులపై మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు కరెంట్ కట్ చేస్తున్నారని ప్రశ్నించగా ఎస్సీ కాలనీ వాసులు మీటర్లు పెట్టుకోవడం లేదని అధికారులు సమాధానం ఇచ్చారు. మీటర్లు పెట్టుకునేలా అవగాహన కల్పించాలి గాని, కరెంట్ కట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.? ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. డెంగ్యూ ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, ప్రజలు భయపడొద్దని భరోసా ఇచ్చారు. నగరంలోని రేకుర్తి, తీగలగుట్టపల్లిలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని, రాంనగర్, మారుతీనగర్లో త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్తపల్లి సమీపంలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
అధికారుల నిలదీత
జడ్పీ సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు ప్రజా సమస్యలపై అధికారులను నిలదీశారు. వైద్య, ఆరోగ్య శాఖపై జరిగిన చర్చలో మానకొండూర్ జడ్పీటీసీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ, వైద్యం కోసం ప్రజలు వస్తే ప్రభుత్వ దవాఖానలో పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దవాఖాన నిర్వహణ కమిటీ చెప్పినా పట్టించుకోకుంటే ఎలాగని అధికారులను ప్రశ్నించారు.? దవాఖానలో కొందరు ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరాం శ్యాం మాట్లాడుతూ, సదరం క్యాంపులు ఎందుకు నిర్వహించడం లేదని అధికారులను నిలదీశారు. తమ మండలంలోని అనేక గ్రామాల్లో ఎస్సీ కాలనీలకు కరెంట్ కట్ చేస్తున్నారని శంకరపట్నం జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి సమావేశంలో ప్రస్తావించగా మంత్రి గంగుల స్పందించి విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామడుగు ఎంపీపీ కవిత మాట్లాడుతూ, మోతెవాగు ప్రవాహంలో వందకుపైగా విద్యుత్ స్తంభాలు పడిపోయాయని, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు శుక్రొద్దీన్ మాట్లాడుతూ, ఎస్సారెస్పీ కాలువ సమీపంలో ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమిస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు. ముస్లింల కబ్రస్తాన్లకు ప్రహరీ నిర్మించాలని జడ్పీ చైర్పర్సన్ విజయకు వినతి పత్రం అందజేశారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ, జిల్లాలోని వైకుంఠధామాలను త్వరగా వినియోగంలోకి తేవాలని డీపీవోను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున మాట్లాడుతూ, దళిత బంధు పథకం అమలు తీరును వివరించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ సీఈవో ప్రియాంక, వివిధ శాఖల అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.