రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి గురువారం సిరిసిల్లలో పర్యటించారు. ముందుగా సిరిసిల్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా 6వేల మంది ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టరేట్ సమావేశమందిరంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత పోడు భూముల సమస్యలపై కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.
– సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్/తెలంగాణ చౌక్/ కలెక్టరేట్, సెప్టెంబర్ 22
నూతన ఆవిష్కరణలు సృష్టించాలి
డబ్బులు సంపాదిస్తే ఉండొచ్చు, ఖర్చుకావచ్చు. కానీ, విద్య అనేది దొంగిలించబడని ఆస్తి. విజ్ఞానానికి మించిన సంపద లేదు. ట్యాలెంట్ ఎవరి సొంతం కాదు. పట్టణాల్లో చదివే పిల్లల వద్దే ప్రతిభ ఉంటుందనుకోవడం అవివేకం. గ్రామాల్లో చదివే విద్యార్థుల్లోనూ ప్రతిభ ఉంటుంది. విద్యా వనరులతో జీవితంలో ఎలా పైకి రావాలనే ఆలోచనను కల్పించుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా ప్రతిభ చూపాలి. ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా ఎదగాలి. సొంతంగా ఉద్యోగాలు చేయడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించేలా నూతన ఆవిష్కరణలు సృష్టించాలి. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు ఓవర్సీస్ పథకంలో 20లక్షలు అందిస్తున్నది. స్వయంగా కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
– మంత్రి కేటీఆర్
సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్/తెలంగాణ చౌక్, సెప్టెంబర్ 22: విద్య, విజ్ఞానానికి మించిన సంపద, ఆస్తి లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సూచించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ప్రకటించిన ట్యాబ్లను గురువారం సిరిసిల్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల మైదానంలో ఇంటర్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సిరిసిల్ల జిల్లాను విద్యా కేంద్రంగా చేయడానికి సీఎం కేసీఆర్ ఆశీస్పులతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. సర్దాపూర్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, జిల్లెల్లలో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అత్యున్నత ప్రమాణాలతో వ్యవసాయ కళాశాల, అగ్రహారంలో జేఎన్టీయూ, వైద్య కళాశాల మంజూరు చేసినట్లు తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయంగా కాకుండా మనసుకు సంతృప్తినిచ్చేలా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉపయోగపడే పనులు చేయండి
రాజకీయ నాయకులు అధికారంలోకి రాగానే భ్రమలో జీవిస్తారని, భూమ్మీద పరిమిత కాలంగానే అందరం బతుకుతామని, ఉన్న ఈ సమయంలోనే అవకాశం వచ్చినప్పుడలా మంచి ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. తన పుట్టిన రోజు సందర్భంగా కేక్లు, బొకేలు, బ్యానర్లు, అనవసర ఖర్చు చేయడం సరికాదనిపించిందని, అదే డబ్బుతో పేదలు, ఆర్థుల కోసం ఏదైనా మంచి పని చేయాలని ఆలోచన వచ్చిందన్నారు. మూడేళ్ల క్రితం సొంత డబ్బులతో ఆరు అంబులెన్సులను సిరిసిల్ల జిల్లాకు ఇవ్వడం తనకెంతో సంతోషం కలిగిందని గుర్తు చేశారు. ఇది ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు, నేతలు దాదాపు 120 అంబులెన్సులను అందించారని తెలిపారు. రెండేండ్ల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా మళ్లీ సిరిసిల్ల నియోజకవర్గంలో దాదాపు 200 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను పంపిణీ చేశానని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఎమ్మెల్యేలు, నాయకులు 1200ల త్రిచక్ర వాహనాలు అందివ్వడం ఆనందాన్నిచ్చిందన్నారు.
చదువుకు ఆటంకం కలుగొద్దనే ట్యాబ్లు
కరోనా సమయంలో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఉండడంతో విద్యార్థుల విద్య కుంటుపడిందని, ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ట్యాబ్లు అందిస్తే చదువుకు ఆటంకం కలుగవద్దనే సదాలోచనతో వీటి పంపిణీకి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై బైజ్యూస్ కంపెనీ ప్రతినిధులైన ఆదేశ్సింగ్ చడ్డా, సుస్మిత్ సర్కార్ను దావోస్ పర్యటనలో కోరడంతో స్పందించి ట్యాబ్లు అందించడానికి అంగీకారం తెలిపారని చెప్పారు. సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు 6 వేల ట్యాబ్లను అందిస్తామని వారు ప్రకటించడంతో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విద్యాభివృద్ధికి టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని, రాష్ట్రంలో కొత్త కళాశాలలు మంజూరు చేయడమే కాకుండా పాఠశాలలను ‘మన ఊరు-మన బడి’లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. త్వరలో పాఠశాలల మైదానాలను ఆధునికీకరించనున్నట్లు ప్రకటించారు. సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానాన్ని రూ.రెండు కోట్లతో ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. ట్యాబ్ల వినియోగంపై విద్యార్థులకు శిక్షణ ఇస్తామని అన్నారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ఈ ట్యాబ్ను రూపొందించినట్లు, విద్యాంశంలో కొత్త, కొత్త యాప్లను ట్యాబ్లలో నిక్షిప్తం చేశామని వెల్లడించారు. సభా వేదికపై బైజ్యూస్ కంపెనీ ప్రతినిధులు ఆదేశ్సింగ్ చడ్డా, సుస్మిత సర్కార్ను శాలువాలతో మంత్రి కేటీఆర్ సన్మానించారు. ఇంత మంచి కార్యక్రమానికి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
మంచి పనులు చేసి పోటీ పడండి
రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు చేసే ఖర్చంతా బూడిదలో పోసే పన్నీరవుతుంది. ప్రజాసేవ చేయాలనే తపన రాజకీయ నేతలకు కలగాలి. ఎన్నికలు రాగానే అడ్డమైన ఖర్చులు పెట్టడానికి ఉత్సాహం చూపడం నాకు నచ్చదు. మద్యానికి, ఇతర వృథా ఖర్చులకు స్వస్తి పలికి పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలి. మంచి పనులు చేస్తే ప్రజలు తమ మదిలో ఉంచుకుంటారు. విపక్షాల నేతలు నా కంటే ఎక్కువ మంచి పనులు చేసి ఎన్నికల్లో నాతో పోటీపడాలి. ఎన్నికల్లో సమాజాన్ని భ్రష్టు పట్టించేలా తయారు చేయడం బాధకలిగిస్తున్నది. పేదలకు నా కంటే రెండు మంచి పనులు ఎక్కువ చేసి నన్ను ఓడించాలి. ఎన్నికల్లో ఒక్క చుక్క మందు పంచేది లేదు. పైసలిచ్చేదీ లేదు. సిరిసిల్ల ప్రజలకు మద్యం, మందు తీసుకునే సంస్కృతి లేదు.
– మంత్రి కేటీఆర్ సవాల్
కలెక్టర్ను ఆదర్శంగా తీసుకోండి
కలెక్టర్ అనురాగ్ జయంతిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. ఖరగ్పూర్లో ఐఐటీ పూర్తి చేసి శ్రమ, పట్టుదలతో చదివి కలెక్టర్గా ఉద్యోగం సంపాదించారని తెలిపారు.
ట్యాబ్ను చూపుతున్న మంత్రి కేటీఆర్ ,విద్యార్థులతో ఆత్మీయంగా..
సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్/తెలంగాణ చౌక్, సెప్టెంబర్ 22 : మంత్రి కేటీఆర్ తన ప్రసంగం అనంతరం వేదిక దిగి, గ్యాలరీలలో ఉన్న విద్యార్థుల వద్దకు వెళ్లారు. తన చేతుల మీదుగా ట్యాబ్లను అందించి సంతోషాన్ని పంచుకున్నారు. దాదాపు 850 మంది విద్యార్థులకు ఒక్కొక్కటి 60 వేల నుంచి 70 వేల విలువైన ట్యాబ్లను అందిస్తూ ఆత్మీయంగా పలుకరించారు. ట్యాబ్ల గురించి స్వయంగా వివరించారు. వారితో సెల్ఫీలు తీసుకొని ఆటోగ్రాఫ్లు ఇచ్చారు. దాంతో విద్యార్థులంతా సంతోషం వ్యక్తం చేశారు. థాంక్యూ సర్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
ఆన్లైన్ క్లాస్లకు ఇబ్బందిలేదు..
కరోనా టైంల స్మార్ట్ఫోన్లులేక, ట్యాబుల్లేక ఆన్లైన్ చదువులకు దూరమైనం. దీంతో చదువుల వెనుకబడిపోయినం. మాలాంటి నిరుపేద విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి మంత్రి కేటీఆర్ సారు ట్యాబ్లు ఇవ్వడం సంతోషంగా ఉన్నది. ఆయన సేవాగుణం మరువలేనిది. సారిచ్చిన ట్యాబ్లో విలువైన సాఫ్ట్వేర్ ఉన్నది. ఆన్లైన్ క్లాసులకు ఇగ ఇబ్బందిలేదు.
– భూక్య ప్రశాంత్,ఎంపీసీ సెకండియర్ బీసీ బాలుర గురుకుల స్కూల్ (పెద్దూరు)
ట్యాబ్ ఇచ్చిన సార్కు థ్యాంక్స్
మంత్రి కేటీఆర్ సారు పేదల గురించి ఆలోచించే నాయకుడు..ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టం. ఇన్నాళ్లు స్మార్ట్ చదువులు డబ్బున్నోళ్లకు మాత్రమే అనే అపోహ ఉండేది. కానీ కేటీఆర్ సారు అందించిన ట్యాబ్ల ద్వారా మాలాంటి నిరుపేద విద్యార్థులకు సైతం అందుతాయి. ట్యాబ్ ఇచ్చిన సార్కు థ్యాంక్స్.
– రుచిత, బైపీసీ ఫస్టియర్ కేజీబీవీ (సిరిసిల్ల)
హ్యాపీగా ఉన్నది..
మంత్రి కేటీఆర్ సార్ తన పుట్టిన రోజున ఇచ్చిన హామీ మేరకు ట్యాబ్లు ఇవ్వడం హ్యాపీగా ఉన్నది. మాలాంటి పేద విద్యార్థులకు ఈ ట్యాబ్లు ఎంతో ఉపయోగపడుతాయి. వీటి ద్వారా విలువైన డాటా పొందే అవకాశముంటుంది. ట్యాబ్ను సద్వినియోగం చేసుకుంట. సారిచ్చిన ప్రోత్సాహంతో బాగా చదువుకొని అమ్మానాన్నల పేరు నిలబెడుత.
– కే వర్షిణి, ఎంపీసీ ఫస్టియర్ కేజీబీవీ (సిరిసిల్ల)
సారు నమ్మకాన్ని నిలబెడుత..
పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ సార్ ట్యాబ్లు అందజేసిండు..వీటిలో ఎంతగానో ఉపయోగపడే సాఫ్ట్వేర్ ఉన్నది. ట్యాబ్ను ఆయన చేతుల మీదుగా అందుకోవడం ఆనందంగా ఉన్నది. వీటిని వినియోగించుకొని బాగా చదువుకొని కేటీఆర్ సారు నమ్మకాన్ని నిలబెడత. మా తల్లిదండ్రులకు సైతం మంచిపేరు తెస్తా.
– గంగు భాను, ఎంపీసీ సెకండియర్ గురుకుల స్కూల్ (చిన్నబోనాల)