కొత్తపల్లి, సెప్టెంబర్ 19 : సంపదను పెంచి పేదలకు పంచడమే తెలంగాణ సర్కారు ధ్యేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. సమస్యల రహిత పల్లెల నిర్మాణానికి విరివిగా నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇదేకోవలో కొత్తపల్లి మండలాభివృద్ధికి నెలరోజుల్లోగా రూ.10 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరయ్యారు.
ఈ సమావేశంలో వ్యవసాయం, విద్య, వైద్యం, మిషన్ భగీరథ తదితర 16 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రిమాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల మెప్పు పొందేలా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం సాగురంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో రాష్ట్రంలో 30 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. 24 గంటల కరెంట్, ప్రాజెక్టుల నిర్మాణంతో రైతులు భూమికి బరువయ్యేలా పంటలు పండించడమే కాకుండా దేశంలోని వివిధ రాష్ర్టాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడం అభినందనీయన్నారు. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి సీజన్లో పంట మార్పిడిని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఒక్క వరి పండిస్తే సరిపోదని గుర్తించిన ప్రభుత్వం రైతులను ఆయిల్ పామ్ సాగు చేసేలా సహకారం అందిస్తున్నదని చెప్పారు. కొత్తపల్లి మండలంలోని నాగులమల్యాల, ఆసిఫ్నగర్, బద్దిపల్లి, కమాన్పూర్, బావుపేట, ఎలగందుల చెరువులకు పూర్వవైభవం తీసుకురావడంతో మండుటెండల్లో మత్తడి దుంకుతున్నాయన్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నదని పేర్కొన్నారు. తాగునీటి కోసం మహిళలు బిందెలతో రోడ్డెక్కే పరిస్థితులు తెలంగాణలో ఇక కనిపించవన్నారు. అక్టోబర్ చివరిలోగా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పనుల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని హర్షిస్తూ సభ్యులందరూ సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశారు. సమావేశంలో ఎంపీడీవో ఏ శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ పిట్టల కరుణ, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, మండల కో ఆప్షన్ సభ్యుడు షాబీర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.