సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): గిరిజన, ఆదివాసీ బిడ్డలు తలెత్తుకునేలా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆత్మగౌరవ బావుటాను ఎగురవేశారు. చరిత్రలో ఎవరూ చేయని విధంగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గిరిజన, ఆదివాసీల కోసం కుమ్రంభీం ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ బంజారా భవన్ను నిర్మించి శనివారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివాసీ భవన్లో ‘ఆదివాసీ బిడ్డలందరికీ సందీర్కుర్ రాం..రాం..’ అని, బంజారాభవన్లో ‘యాడిన్.. బాపున్.. రాం..రాం’ అని అభివాదం చేశారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ‘తెలంగాణ ఆదివాసీ, బంజారా ఆత్మీయ సభ’లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కుమ్రం భీం, సేవాలాల్ వారసులతో ఎన్టీఆర్ స్టేడియం నిండిపోయింది. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, లంబాడి నృత్యాలతో కళాకారులు హోరెత్తించారు. ఆదివాసీ, గిరిజన సాంస్కృతిక పాటలు, నృత్యాలు మార్మోగాయి. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా ఆత్మగౌరవ భవనాలు నిర్మించి అందించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని గిరిజన ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేశారు.
వారం రోజుల్లోగా జీవో
గిరిజనుల రిజర్వేషన్ పెంపుపై ఏడేండ్ల కిందటే అసెంబ్లీ తీర్మానం పంపాం. కేంద్రాన్ని అడిగీ.. అడిగీ విసిగిపోయాం. ఇక వేచి చూసేది లేదు. వారం రోజుల్లోగా రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో తీసుకొస్తాం. మోదీ దానిని గౌరవిస్తారో లేదా మెడకు ఉరితాడుగా మార్చుకుంటారో ఆయన ఇష్టానికే వదిలేస్తున్నా.
గిరిజన బంధు ప్రారంభిస్తాం
మీకు ఇంకో శుభవార్త చెప్తున్నా. సంపద పెంచడం, అవసరమైన పేదలకు పంచడమే ప్రభుత్వ సిద్ధాంతం. పోడు భూములు పంచిన తర్వాత అస్సలు భూమి లేకుండా ఉన్న గిరిజనుల లెక్క తేల్చి, దళితబంధు తరహాలో ఇంటికి రూ.10 లక్షలు ఇస్తూ గిరిజన బంధు ప్రారంభిస్తాం.
– సీఎం కేసీఆర్