కరీంనగర్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శుక్రవారం భారీ ర్యాలీలతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీల్లో ఎక్కడా 20 వేలకు తక్కువ కాకుండా జనాలు పాల్గొన్నారు.
కరీంనగర్లో జరిగిన ర్యాలీని స్థానిక అమరుల స్తూపం వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అమరులకు నివాళులర్పించి ప్రారంభించారు. కలెక్టర్ బంగ్లా నుంచి పోలీస్ హెడ్క్వార్టర్స్, బస్టాండ్, మల్టీప్లెక్స్, కలెక్టరేట్, భగత్నగర్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ స్టేడియం వరకు దాదాపు రెండు కిలో మీటర్లు సాగిన ర్యాలీలో రోడ్లన్నీ తివ్రర్ణ పతాకాలతో నిండిపోయాయి. మంత్రి గంగుల కమలాకర్ జాతీయ జెండాను పట్టుకుని ముందు వరుసలో నడిచారు. జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, మేయర్ వై సునీల్రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు ఆయనను అనుసరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు.
మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తోపాటు స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జడ్పీ సీఈవో ప్రియాంక పాల్గొన్నారు. పెద్ద చెరువు కట్ట వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. గడి నుంచి కూరగాయల మార్కెట్, తూర్పు దర్వాజ, పల్లెమీదుగా మంజంపల్లి సొసైటీ గ్రౌండ్ వరకు రెండు కిలో మీటర్ల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన భారీ సభకు 20 వేలకు పైగా జనం హాజరయ్యారు. గన్నేరువరం మండల కేంద్రం నుంచి గుండ్లపల్లి వరకు భారీ బైక్ ర్యాలీని తీశారు.
చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధరలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. గంగాధర మండల కేంద్రం నుంచి మధురానగర్ ఎక్స్ రోడ్ వరకు కళాకారుల ఆటా పాటల మధ్య ర్యాలీ కొనసాగింది. 20 వేలకుపైగా జనాలు హాజరయ్యారు. మహిళలు, యువకులు, విద్యార్థులు, అధికారులతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మధురానర్ ఎక్స్ రోడ్డులో భారీ సభ నిర్వహించారు.
హుజూరాబాద్లో జరిగిన వేడుకల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాలతోపాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలం నుంచి భారీ సంఖ్యలో జనాలు హాజరయ్యారు. జమ్మికుంట నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో హుజూరాబాద్కు చేరుకున్నారు. స్థానిక జూనియర్ కళాశాల నుంచి హైస్కూల్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ జరిగిన భారీ సభలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి మాట్లాడారు. ఇక్కడ అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్తోపాటు మున్సిపల్ చైర్పర్సన్లు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మహిళలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.