కార్పొరేషన్, సెప్టెంబర్ 16 : రాష్ట్రంలో ప్రపథమంగా సెప్టెంబర్ 17ను సీఎం కేసీఆర్ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్నారని, తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునే, సంతోషకరంగా ఉండే రోజు ఇదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై మళ్లీ కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. అలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని, చరిత్రను ఎవరూ మరిచిపోవద్దని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం నగరంలో విద్యార్థులు, యువకులు, మహిళలు సబ్బంవర్గాలు భారీ ర్యాలీ తీశారు. స్థానిక తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్రావుతో కలిసి మంత్రి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీని ప్రారంభించి, ప్రజలు, విద్యార్థులు, యువతతో కలిసి వెళ్లారు. అంబేద్కర్ స్టేడియానికి చేరుకున్నారు. అమరవీరుల స్తూపం వద్ద ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ చౌర స్తా, ప్రతిమ మల్టీఫ్లెక్స్, కలెక్టరేట్, భగత్సింగ్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ స్టేడియానికి చేరుకున్నది.
అక్కడ నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్థానం ప్రజాస్వామిక భారతదేశంలో చేరాలని ఎందరో నాయకులు పోరాటం చేశారని గుర్తు చేశారు. రాచరిక పాలన అంతమైనా భారత ప్రజాస్వామిక పాలనలో చేరిన రోజు సెప్టెంబర్ 17 అని పేర్కొన్నారు. ఆ సమయంలోనే తెలంగాణ సంస్థానం ప్రపంచంలో ధనికమైన సంస్థానమని చెప్పారు. 1953లో మద్రాసు నుంచి వేరుపడిన ఆంధ్రాను అక్కడ ఏమీ లేదని, హైదరాబాద్ సంస్థానం అన్ని విధాలా ధనికంగా ఉందని బలవంతంగా ఆంధ్ర, తెలంగాణను కలిపారని విమర్శించారు. దీంతో తెలంగాణ మరోసారి తమ హక్కులను కోల్పోయిందన్నారు. అప్పటి నుంచి అధికారమంతా ఆంధ్ర పాలకుల చేతుల్లో ఉండడంతో తెలంగాణ పూర్తిగా వెనుకబడి పోయిందన్నారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని కేసీఆర్ ఉద్యమం చేసి 2014లో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని గుర్తు చేశారు. ఈ ఎనిమిదేండ్లలోనే దేశంలో అభివృద్ధి సాధించిన తెలంగాణగా తీర్చిదిద్దారని తెలిపారు. సాగునీరు, 24 గంటల కరెంట్, తదితర సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్న తెలంగాణపై మళ్లీ కుట్రలు, కుతంత్రాలు మొదలయ్యాయని విమర్శించారు.
తెలంగాణ ఏర్పాటు కాకముందు బతుకుదెరువు కోసం దుబాయ్, మస్కట్ లాంటి ఎన్నో దేశాలకు వలసపోయే పరిస్థితి ఉందన్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుండడంతో వలసలు తగ్గాయని, అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణను చూసి కొందరు ఈర్ష్య, అసూయతో ఇబ్బందులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అందరి సంక్షేమం కోసం తపిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. నగర మేయర్ వై సునీల్రావు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధపోరాటంలో ఎక్కడా లేని వారు కూడా ఇప్పుడు తప్పుడు ప్రచారాలతో అడ్డదిడ్డంగా వ్యవహస్తున్నారని విమర్శించారు.
ప్రస్తుతం తెలంగాణలో సాగుతున్న అభివృద్ధిని చూసి ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా ఇలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమ రాష్ర్టాల్లో ఎందుకు అమలు కావడం లేదన్న విషయంలో ఆలోచనలు చేస్తున్నారని పేర్కొన్నారు. సమైక్యతా వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ట్రైనీ కలెక్టర్ లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలతో కలిసి భోజనం చేసిన మంత్రి
ఉత్సవాల్లో భాగంగా ర్యాలీల్లో పాల్గొన్న నాయకులు, అధికారులు, ప్రజలు, విద్యార్థుల కోసం అంబేద్కర్ స్టేడియంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావు ప్రజలు, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనాల వద్ద ప్రజలు, మహిళలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలందరికీ భోజనం అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.