చిగురుమామిడి, జనవరి 23: హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. ఊరూర నర్సరీల ద్వారా మొకలు పెంచి స్థానికంగా నాటించేలా చర్యలు తీసుకుంటున్నది. పచ్చదనంతో అటవీ విస్తీర్ణం పెంచే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. గతంలోలో కన్నా భిన్నంగా ఈసారి మొకల లక్ష్యం పెంచే దిశగా అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. తాజాగా మండలంలో మొకల లక్ష్యాన్ని అధికారులు గ్రామ సభల ద్వారా నిర్దేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటికే నర్సరీల ద్వారా మొకలను ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం ప్రతి గ్రామానికి 10 నుంచి 20 వేల మొకలు నాటారు. వచ్చే హరిత హారంలో సైతం అదే స్థాయిలో మొకలు నాటాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో భాగంగా మండలంలోని 17 గ్రామ పంచాయతీల నర్సరీల్లో మట్టి సేకరణ, బ్యాగులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. విత్తనాల పనులు ఈజీఎస్ ఏపీవో, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పర్యవేక్షిస్తున్నారు. ఏపీవో, సాంకేతిక సహాయకులు, సర్పంచులు ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వరి నాట్ల పనుల్లో బిజీగా ఉండడంతో నర్సరీల్లో పనులకు కూలీల కొరత ఏర్పడుతున్నది.
ప్రణాళికతో పనులు ..
ప్రభుత్వం ప్రతి ఏటా హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. సీఎం కేసీఆర్, అధికారుల సూచనల మేరకు హరితహారంలో భాగంగా నర్సరీలో మట్టి సేకరణ పనులు పూర్తి చేయించాం. మొకలను బ్యాగులో పెట్టి, ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు నిర్వహిస్తున్నాం. నాటిన మొకలు ఎదిగేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులకు ఈజీఎస్ సిబ్బందికి సూచించాము.