మంథని, ఆగస్టు 18 : “నేనేం పాపం చేసిన. కావాలనే నాపై ఇన్ని కుట్రలు పన్నుతున్నరు. నిత్యం అసత్య ఆరోపణలు చేస్తున్నరు. కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నరు. వాస్తవాలను గ్రహించకుండా కొన్ని పేపర్లు, మీడియా చానళ్లు న్యూస్ను ప్రచురించడం చాలా బాధాకరం. 65 ఏళ్ల చీకటి పాలనకు స్వస్తి పలికి.. ఓ బీసీ బిడ్డ అధికారం చేపట్టడమే మంథని నియోజకవర్గం పాపమైందా..?”అంటూ పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన నల్ల జెండాను నుదుటిపై కట్టుకొని మంథనిలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ, పేదింటి బిడ్డనైన తాను గతంలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడాన్ని జీర్ణించుకోలేక కొందరు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆనాటి నాగరాజు ఆత్మహత్య కేసు నుంచి మొదలుకొని నేటి చీకోటి ప్రవీణ్ వ్యవహారం దాకా తరుచూ తనను, తన కుటుంబాన్ని, తమ పార్టీ పై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా వచ్చే ఆరోపణల్లో ఏది వాస్తవం? ఏది అవాస్తవం? అనేది సైతం గ్రహించకుండా కొన్ని ప్రముఖ పేపర్లు (నమస్తే తెలంగాణ కాదు), టీవీ చానళ్లు తనపై ఇష్టం వచ్చినట్లుగా న్యూస్ను ప్రసారం చేస్తున్నాయన్నారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు నాగరాజును ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించానని ఆరోపిస్తూ కొందరు కేసు వేస్తే.. అది కోర్టులో నిలువలేదని గుర్తు చేశారు. మంథని మధూకర్ ఆత్మహత్యకు కారణం తానేనంటూ హైదరాబాద్, ఢిల్లీ నుంచి మీడియా ప్రతినిధులు వచ్చి రాద్దాంతం చేశారని, ఆ ఆత్మహత్య కేసు కోర్టులో ఉందని, మళ్లీ దానిపై ఎందుకు కథనాలు రాయడం లేదని ప్రశ్నించారు. మంథని మధూకర్ ఆత్మహత్యను అడ్డం పెట్టుకొని అధికారం చేపట్టిన దొంగ కాంగ్రెస్ నాయకుడు ఏం చేస్తున్నాడో మీడియాకు తెలియదా? అని ప్రశ్నించారు. తాను అక్రమంగా 900 కోట్ల ఆస్తి సంపాదించానని విషప్రచారం చేశారని, ఆ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో మీడియానే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వాటిని చూపిస్తే నియోజకవర్గంలోని పేదలకు, మీడియా సంస్థలకే పంచుతానని స్పష్టం చేశారు. ఓ చిన్న పత్రిక చీకోటి ప్రవీణ్ వ్యవహారంపై కథనం రాస్తే వెంటనే పెద్ద పత్రికలు (నమస్తే తెలంగాణ కాదు) తనపై అసత్యపు రాతలు రాయడం ఎంత వరకు సమంజసమన్నారు. తాను కాసినో ఆడానని దుష్ప్రచారం చేశారని, తనకు డబ్బులుంటే పేదలకు పంచుతానే తప్ప జూదం ఆడనని, మద్యం తాగనని స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు కేవలం రేటింగ్ కోసం మంథని నియోజకవర్గంలో ఏది జరిగినా తనపై రుద్దుతూ బదనాం చేస్తున్నాయని మండిపడ్డారు. తాను అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు రుజువు చేస్తే మంథని అంబేద్కర్ చౌరస్తాలో ఉరి వేసుకుంటానని స్పష్టం చేశారు.
పేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఇల్లు కట్టుకొని, కార్లు కొంటే అవినీతికి పాల్పడినట్లేనా..? అని ప్రశ్నించారు. ఒక్క కుటుంబాన్ని ప్రశ్నించినందుకు తనపై ఇన్ని కుట్రలు చేయాలా..? పేదోడికి అన్యాయం చేయడమే మీడియా లక్ష్యమా..? అని నిలదీశారు. సమాజంలో మూలస్తంభమైన మీడియా సంస్థలు నిజాలు తెలుసుకోకుండా కేవలం ఒక వర్గానికే వత్తాసు పలుకడం సరికాదన్నారు. నిజనిజాలను వెలుగులోకి తీసుకురాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారుసుడిగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. ప్రాణమున్నంత వరకు అవినీతికి పాల్పడనని, పేదలకు అండగా నిలుస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నాయకులు జక్కు రాకేశ్, పూదరి సత్యనారాయణగౌడ్, వీకే రవి, కొట్టె రమేశ్, కుర్రు లింగయ్య, నక్క శంకర్, ఎగోలపు శంకర్గౌడ్, బత్తుల సత్యనారాయణ, కనవేన శ్రీనివాస్యాదవ్, ఎక్కటి అనంతరెడ్డి, గొబ్బూరి వంశీ, రామారావు, రాజు పాల్గొన్నారు.