స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు సంబురంగా జరుపుకుంటున్నారు. ఆదివారం యక్షగాన, ఒగ్గు, జానపద, సారథి కళాకారులు ర్యాలీలు తీశారు. దేశభక్తిని ప్రతిబింబించేలా ఆటపాటలతో హోరెత్తించారు. యువతీయువకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు వాడవాడలా మువ్వన్నెల జెండాలతో ర్యాలీలు తీశారు. జాతీయ సమైక్యత స్ఫురించేలా పటాకులు కాల్చారు. పలుచోట్ల ఫ్రీడం క్రీడాపోటీలు నిర్వహించారు. వేములవాడ, ధర్మపురి ఆలయాల్లో అధికారులు, సిబ్బంది శ్రమదానం చేసి పరిసరాలను శుభ్రం చేశారు. హరికథాకాలక్షేపం, కవిసమ్మేళనం, సంగీత విభావరి నిర్వహించారు.
కలెక్టరేట్, ఆగస్టు 14: కరీంనగర్ జిల్లావ్యాప్తంగా స్వతంత్ర వజ్రోత్సవాలు వైభవ ంగా సాగుతున్నాయి. ఏడోరోజు ఆదివారం జానపద కళాకారులు ప్రదర్శనలతో అలరించారు. కరీంనగర్లో యువకులు బైక్లకు పతాకాలను కట్టుకొని ర్యాలీ తీశారు. దారిపొడుగునా ‘జై జవాన్..జై కిసాన్..మేరా భారత్ మహాన్’ అంటూ నినదిస్తూ ముందుకుసాగారు. సఖీ ఆధ్వర్యంలో ఫ్రీడం ర్యాలీ నిర్వహించారు. జానపద కళాకారులు తెలంగాణ అమరువీరుల స్తూపం నుంచి కలెక్టర్ క్యాంపు కార్యాలయం, ప్రతిమ మల్టీఫ్లెక్స్ మీదుగా కలెక్టర్ ఆడిటోరియం వరకు ర్యాలీ తీశారు.
అంతకుముందు వీరి ర్యాలీని అదనపు కలెక్టర్లు గరిమా ఆగర్వాల్, శ్యాంప్రసాద్లాల్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ప్రారంభించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో చిందు యక్షగాన కళాకారుల ప్రదర్శనలు, జానపద, ఒగ్గు కళారూపాలు, సారథి బృందం కళాకారులు ఆటపాటలతో అలరించారు. సిక్కు యువకులు గురు గోవింద్సింగ్ ఆలయం నుంచి సిక్వాడీ వరకు బైక్ర్యాలీ తీశారు. గంగాధర మండలం బూరుగుపల్లి చౌరస్తాలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ టీఆర్ఎస్ నేతలతో కలిసి పటాకులు కాల్చారు. మానకొండూర్ చెరువు కట్టపై ఎమ్మెల్యే రసమయి నేతృత్వంలో జానపద కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. హుజూరాబాద్లో కళాకారులు ర్యాలీ తీశారు. ఆర్ఎంపీలు ఫ్రీడం ర్యాలీ నిర్వహించారు.