కార్పొరేషన్, ఆగస్టు 9: స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని నగరంలో వాడవాడలా మంగళవారం జాతీయ జెండాలు పంపిణీ చేశారు. స్థానిక 33వ డివిజన్లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మేయర్ వై సునీల్రావుతో కలిసి ఇంటింటికీ వెళ్లి జెండాలను అందించి, పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో నగరంలోని 60 డివిజన్లలో కార్పొరేటర్లు, బల్దియా అధికారులు ఇంటింటికీ జెండా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలో పంపిణీ చేసేందుకు 70 వేల జెండాలను ఇప్పటికే ప్రభుత్వం సరఫరా చేసింది.
బల్దియాకు వచ్చిన జెండాలకు కట్టె ఏర్పాటుతో ఏగురవేయడానికి వీలుగా సిద్ధం చేసి ఇంటి యజమానులకు అందిస్తున్నారు. నగరంలోని 60 డివిజన్లలో కార్పొరేటర్లు తమ ప్రాంతాల్లో పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంటికి జెండా అందించడంతో పాటు జాతీయ జెండా ఎగురవేసే సమయంలో పాటించాల్సినా నియమనిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. రెండు రోజుల్లో ఇంటింటికీ జాతీయ జెండాలు అందిస్తామని నగరపాలక సంస్థ అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఆవిష్కరించాలని పిలుపునిస్తున్నారు.
ప్రతి ఇంటిపై జెండా ఎగురేలా చర్యలు
స్వతంత్ర వజ్రోత్సవాలను విజయవంతం చేయడంపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా దృష్టి పెడుతున్నారు. ఆయా డివిజన్లలో పారిశుధ్య సిబ్బందితో జెండాలు పంపిణీ చేయిస్తున్నారు. వీరు ప్రతి ఇంటికి జెండాను అందించడంతో పాటు ఎగురవేసేలా చూడాలని అధికారులు ఆదేశించారు. ఈనెల 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడేలా సిబ్బంది చొరవ తీసుకుంటున్నారు. ఈనెల 16న చేపట్టనున్న సామూహిక జాతీయ గీతాలాపనకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన చౌరస్తాలు, డివిజన్లలోని ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సౌండ్ బాక్స్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఈనెల 22 వరకు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేసే దిశగా బల్దియా చర్యలు చేపడుతున్నది.
కొత్తపల్లి, ఆగస్టు 9: పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు ఇంటింటీకీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్నదని, ప్రతి ఒక్కరూ ఈనెల 15న ఇంటిపై జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, కౌన్సిలర్లు మానుపాటి వేణుగోపాల్, గండు రాంబాబు, టీఆర్ఎస్ నాయకులు ఎస్కే బాబా, సుధాకర్, మెప్మా అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, ఆగస్టు 9: నగరంలోని భగవతి పాఠశాలలో ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల చైర్మన్ బీ రమణారావు, కరస్పాండెంట్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ తీశారు.
విద్యానగర్, ఆగస్టు 9: నగరంలోని 19వ డివిజన్లో కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఐ హాస్పిటల్, స్వామి కాలనీ, ఇందిరమ్మ కాలనీలో ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవీకృష్ణా గౌడ్, డివిజన్ ప్రత్యేకాధికారి సంధ్య, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. 17వ డివిజన్(శ్రీరాంనగర్ కాలనీ)లో కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మి- ప్రశాంత్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు రవి, శ్యాం తదితరులు పాల్గొన్నారు.