ధర్మారం, ఆగస్టు 9: ధర్మారం, వెల్గటూర్, పాలకుర్తి మండలాల రైతుల సాగునీటి కల నెరవేరుతున్నది. మంత్రి కొప్పుల ఈశ్వర్ కృషితో ఎస్సారెస్పీ చివరి భూములకు సమృద్ధిగా నీరందబోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది రిజర్వాయర్ ద్వారా డీ-83 సబ్ కెనాల్ 11ఎల్కు అనుబంధంగా నూతన కెనాల్ మార్గం సుగమమైంది. నిర్మాణానికి తాజాగా రూ. 8.55 కోట్ల నిధులు మంజూరుకాగా, పనులకు త్వరలోనే పునాది పడబోతున్నది. కాలువ అందుబాటులోకి వస్తే 6,500 ఎకరాల భూములు స్థిరీకరణ జరుగనుండగా, రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
వివరాల్లోకి వెళితే… జూలపల్లి మండలం కుమ్మరికుంట శివారులోని ఎస్సారెస్సీ డీ83 కెనాల్కు అనుబంధంగా 11ఎల్ కెనాల్ ఉంది. ఇది కుమ్మరికుంట నుంచి పాలకుర్తి, వెల్గటూరు మండలాల దాకా విస్తరించి ఉంటుంది. ఈ సబ్ కెనాల్ కింద మొత్తం 10,680 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాల్వకు ఎస్సారెస్పీ నుంచి 146 క్యూసెక్కుల నీటి కేటాయింపు ఉండగా, చివరి గ్రామాల దాకా నీరందేదికాదు. ధర్మారం మండలం దాటి నీరు వెళ్లేది కాదు. ఫలితంగా పంటలు ఎండిపోయేవి. తమ పొలాలకు నీరందడం లేదని చివరి గ్రామాల రైతులు ఏండ్ల నుంచి విజ్ఞప్తులు చేసినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
లింక్ కెనాల్కు లైన్ క్లియర్..
సమైక్య రాష్ట్రంలో నెరవేరని కల స్వరాష్ట్రంలో సాకారమవుతున్నది. పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి సమస్యను తెలుసుకున్న కొప్పుల ఈశ్వర్ పరిష్కారానికి ఉన్న మార్గాలపై ఎస్సారెస్పీ అధికారులతో చర్చించారు. నంది రిజర్వాయర్ నుంచి లింక్ కెనాల్ నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం అవుతుందని నిర్ణయించి, సర్వే చేయించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు అనుమతించిన ప్రభుత్వం, మంగళవారం రూ.8.55 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కెనాల్ పూర్తయితే ధర్మారంలోని బొట్లవనపర్తి, కానంపల్లి, సాయంపేట, గోపాల్రావు పేట, పాలకుర్తి మండలంలోని ముంజంపల్లి, మారేడుపల్లి, ఉండెడ, కుక్కలగూడూరు, వేమునూరు, వెల్గటూరు మండలంలోని పాతగూడూరు, గొడిశెలపేట, శానబండ, పడకల్ గ్రామాల్లోని గ్రామాలలోని 6,000 ఎకరాలకు పుష్కలంగా నీరందుతుంది. కాలువకు చెరువు నీటిని అనుసంధానిస్తే మరో 500 ఎకరాలకు ప్రయోజనం కలుగుతుంది.
రైతు సంతోషంగా ఉండాలనే..
ఎస్సారెస్పీ డీ83 11ఎల్ కాల్వకు అనుబంధంగా చివరి భూములకు ఎన్నోఏండ్ల నుంచి నీరందడం లేదు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు సంతోషంగా ఉండాలనే కొత్త కెనాల్ నిర్మించాలని నిర్ణయించాం. ఎన్నోఏండ్ల సమస్యకు పరిష్కారం చూపాం. కెనాల్కు రూ.8.55 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం.
– కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర మంత్రి.