ధర్మపురి/ జగిత్యాల రూరల్, ఆగస్టు 9: భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే వజ్రోత్సవాలను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. దేశ, రాష్ట్ర పౌరులుగా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. పెద్దపల్లి, ధర్మపురి, జగిత్యాల మంగళవారం వజ్రోత్సవ కార్యక్రమాల్లో మంత్రి ఈశ్వర్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్లో నిర్వహించిన జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ధర్మపురిలో ధర్మపురికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, దివంగత మంత్రి కేశవులు స్వగృహంపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. 200 ఏండ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్ లాంటి ఎందరో స్వాత్రంత్య సమరయోధులు ప్రాణ త్యాగం చేస్తేనే మనకు స్వాతంత్య్రం వచ్చిందని, అలాంటి మహనీయులను స్మరించుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర పోరాటాన్ని వివరించే గాంధీ సినిమా చూడాలని కోరారు. స్వాతంత్య్ర సమరయోధులు కేవీ కేశవులు, మాణిక్య శర్మ ధర్మపురికి చెందిన వారు కావడం గర్వకారణమని, కేవీ కేశవులు ఇంటిపై జెండాను ఎగురవేశామని తెలిపారు. వీరిద్దరి పోరాట స్ఫూర్తి భావి తరాలకు తెలిసేలా ధర్మపురిలో ఇద్దరి విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. వారి జయంతి, వర్ధంతి రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
అనంతరం పలువురు ప్రజాప్రతినిధులకు జెండాలను పంపిణీ చేశారు. ధర్మపురి, జగిత్యాలలో ఎంపీ వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ, అందరూ కలిసి వజ్రోత్సవాలను దేశంలోనే వినూత్నంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వంలాగా అందరూ కలిసి ఈ వేడుకలను విజయవంతం చేయాలన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ రకమైన సుపరిపాలన ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, వజ్రోత్సవాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే మన స్వాతంత్య్రం సిద్ధించిందని, వారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి జెండా ఆవిష్కరణ చేసే అదృష్టం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ గుగులోతు రవి మాట్లాడుతూ, ఇప్పటివరకు ప్రతి మండలానికి లక్ష జాతీయ జెండాలను అందజేశామని, ఈ నెల 12వ తేదీలోగా మిగతా వారందరికి అందజేస్తామన్నారు. ప్రతి ఇంటిపై జెండా ఆవిష్కరణ చేయాలని సూచించారు.
అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులకు మంత్రి జాతీయ జెండాను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు బీఎస్ లత, అరుణశ్రీ, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, డీఆర్డీఏ పీడీ వినోద్, డీటీవో శ్యాం నాయక్, ఆర్డీవో మాధురి తదితరులు పాల్గొన్నారు.