సుల్తానాబాద్, జూలై 29 : తాత ఆస్తి కోసం కూతురు కొడుకులు (మనుమలు) తాతనే హత్య చేశారు. ఈ సంఘటన సుల్తానాబాద్లో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి శుక్రవారం వెల్లడించారు. సుల్తానాబాద్ పట్టణంలోని గడిమహాల్కు చెందిన జంగా లింగయ్య (78) భార్య ఓదెమ్మతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. లింగయ్య సింగరేణి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. ఈయనకు కూతుళ్లు రాజమ్మ, వరలక్ష్మి ఉన్నారు. ఇద్దరికి గతంలోనే వివాహమైంది. కాగా.. తండ్రి ఉద్యోగం చేస్తున్న సమయంలోనే పెద్దబొంకూరు గ్రామంలో 2.18 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి పెద్దకూతురు రాజమ్మనే పొలం పనులు చేసుకుంటుంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని లింగయ్య ఇద్దరు కూతుళ్లకు చెరో ఎకరం రిజిస్ట్రేషన్ చేసిచ్చాడు.
పెద్ద కూతురు రాజమ్మ కోరిక మేరకు ఆమె కూతురైన అనిత (మనుమరాలు) పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దకూతురు కొడుకులు నర్ల సంతోష్, నర్ల రవి మొత్తం ఆస్తిపై కన్నేశారు. తాతను నమ్మించి బ్యాంక్ లోన్ కోసమని బాండ్పేపర్పై సంతకం తీసుకున్నారు. మొత్తం భూమి తమకే అమ్మినట్లు రాసుకొని చెల్లె అనిత, పిన్ని వరలక్ష్మిని భూమి కాడికి రాకుండా బెదిరిస్తున్నారు. గతంలో ఈ విషయంపై పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో మనుమలు తాతను కొట్టడంతో పెద్దపల్లి, సుల్తానాబాద్ పోలీస్స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో 15 రోజుల క్రితం లింగయ్య చిన్న కుతూరు వరలక్ష్మి తన పేరిట ఉన్న ఎకరం భూమిలో పంటలు సాగు చేసేందుకు వెళ్లారు. సాగు పనులు చేయనీయకుండా అడ్డుకొన్న లింగయ్య మనుమలు.. వారిని చంపుతామని బెదిరించారు.
తాత, అమ్మమ్మను చంపేస్తే తమకెవరూ అడ్డురారని భావించారు. ఆస్తి అంతా తమకే సొంతం అవుతుందనుకున్నారు. దీంతో ఈ నెల 27న నర్ల సంతోష్, నర్ల రవి కలిసి సుల్తానాబాద్లోని లింగయ్య నివాసానికి వెళ్లారు. వెంట తెచ్చుకున్న కర్రతో తాత, అమ్మమ్మను తీవ్రంగా కొట్టి పరారయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని వెంటనే దవాఖానకు తరలించగా.. లింగయ్య కరీంనగర్లో మృతి చెందాడు. ఆయన భార్య ఓదెమ్మ చికిత్స పొందుతున్నది. కాగా.. లింగయ్య తండ్రి మల్లయ్య, భార్య ఓదెమ్మ ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు.. కేసును 24 గంటల్లోనే ఛేదించారు. శుక్రవారం వారిని రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ ఇంద్రాసేనారెడ్డి, ఎస్ఐలు ఉపేందర్, అశోక్రెడ్డి, ఏఎస్ఐ తిరుపతి, పోలీసు సిబ్బంది తిరుపతి, గణేశ్, అనిత, మల్లేశం, నవీన్ను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు.