కరీంనగర్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సమైక్యవాదుల సంకెళ్ల నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో సకల జనులు కదిలారు. సింహగర్జన నుంచి సకలజనుల సమ్మె వరకు ఏకతాటిగా ముందుకుసాగారు. స్వరాష్ట్రం సాధించే వరకు వెనుకడుగు వేయకుండా సత్తాను చాటి చెప్పారు. పద్నాలుగు ఏండ్ల సుదీర్ఘ పోరాటం తదుపరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. స్వరాష్ట్ర సాధనకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన నాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి ఎంతో మంది నేతలు పాల్గొన్నారు. అది దృష్టిలో పెట్టుకొనే.. ఎంతో మంది నాటి ఉద్యమకారులు, మేధావులకు అధినేత కేసీఆర్ అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. వీటిని అందిపుచ్చుకొని ఏళ్ల తరబడి అధికార దర్పాన్ని అనుభవించిన కొంత మంది నాయకులు.. ఇప్పుడు తమకు మోసం జరిగిందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇటీవలి ఈ తరహా విధానం ఎక్కువగా కనిపిస్తున్నది. ‘మొగున్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు’ అనే సామెతను గుర్తుకు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీలో పదవులు అనుభవించి, ఇప్పుడేమో అదే పార్టీ తమకు అన్యాయం చేస్తుందని విమర్శించడంపై జోరుగా చర్చ సాగుతున్నది.
తొలి మహిళా జడ్పీ చైర్పర్సన్
అలాగే, 2014లో కథలాపూర్ జడ్పీటీసీగా తుల ఉమను గెలిపించిన పార్టీ.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా తొలి మహిళా జడ్పీ చైర్పర్సన్గా అవకాశం కల్పించింది. ఆనాడు చైర్పర్సన్ కుర్చీ కోసం ఎంతో ఒత్తిడి ఉన్నది. తుల ఉమతో పనిచేసిన వారి కుటుంబాలు కూడా తమకు అవకాశం కల్పించాలని కోరాయి. కానీ, అధినేత కేసీఆర్ మాత్రం ఆమెకే అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కావడం అంటే ఆషామాషీ కాదు. ఐదేళ్ల పాటు పదవిలో ఉండి.. ఆ తదుపరి పార్టీకే ఎదురు తిరిగే ప్రయత్నంలో భాగంగా ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు తనకూ టీఆర్ఎస్ అన్యాయం చేసిందంటూ విమర్శిస్తున్నారు. అంతకు ముందు కూడా టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2010లో మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీ అవకాశం కల్పించింది.
దళిత బిడ్డగా శాసన సభలోకి..
శంకరపట్నం మండలం నుంచి జడ్పీటీసీగా గెలిచిన బొడిగె శోభకు 2009 నుంచి చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలను టీఆర్ఎస్ పార్టీ అప్పగించింది. ఆ మేరకు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించింది. తద్వారా కరీంనగర్ జిల్లా నుంచి శాసనసభలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన తొలి దళిత మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. తర్వాత 2018లో పార్టీ టికెట్ రాకపోవడంతో.. ఆమె వెంటనే బీజేపీలో చేరింది. అప్పటి నుంచి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిన విషయాన్ని మరిచిపోయారు.
స్వరాష్ట్రంలో తొలి మేయర్గా అవకాశం
తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న సర్దార్ రవీందర్సింగ్ నిన్నా మొన్నటివరకు టీఆర్ఎస్లో కొనసాగారు. ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా ఉన్నారు. ఆది నుంచీ రవీందర్సింగ్ను అధినేత కేసీఆర్ ఎంతో ఆదరించారు. దేశంలోనే సిక్కు కమ్యూనిటీపై ఏ ముఖ్యమంత్రి మమకారం చూపనంతగా చూపారు. ఎన్నో అడ్డంకులు, ఒత్తిళ్లు ఉన్నా కాదని రవీందర్సింగ్ను కరీంనగర్ కార్పొరేషన్ మేయర్గా చేశారు. స్వరాష్ట్రంలో తొలి మేయర్గా రికార్డులకు ఎక్కించారు. రవీందర్సింగ్ ఐదేళ్ల పాటు పదవిని అనుభవించారు. ప్రస్తుతం అదే పార్టీ టికెట్పై కార్పొరేటర్గా గెలిచి పదవిలో కొనసాగుతున్న ఆయన కూడా ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. తనకూ అన్యాయం జరిగిందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. తనతోపాటు ఉద్యమంలో పాల్గొన్న చాలా మందికి ఇంకా రవీందర్సింగ్ మాదిరిగా అవకాశాలు రాలేదు. వీటన్నింటిని మరిచి.. ఇన్నాళ్లూ పదవులను అనుభవించింది విస్మరించి.. విమర్శలకు దిగుతున్నారు. మొన్నటివరకు కేసీఆర్ నాకు దేవుడు అని చెప్పిన రవీందర్సింగ్.. ఇప్పుడు అదే అధినేతపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న తీరుపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తొలి శాసన మండలి చైర్మన్గా అవకాశం
గతంలో కరీంనగర్ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన స్వామిగౌడ్కు టీఆర్ఎస్లో ఎనలేని ప్రాధాన్యతను కల్పించారు. ఉద్యోగ విరమణ చేయగానే తెలంగాణ పొలిట్బ్యూరో పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలిపించి తెలంగాణ శాసన మండలి తొలి చైర్మన్గా అవకాశం కల్పించారు. ఆ పదవిలో 2014 నుంచి 2019 వరకు పనిచేశారు. పార్టీని వీడిన ఆయన టీఆర్ఎస్పై విమర్శల అస్ర్తాలను సందిస్తున్నారు. నిజానికి ఆయనతోపాటు ఎంతో మంది ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ, ఎవరికీ రాని అవకాశం స్వామిగౌడ్కు వచ్చిందన్న విషయాన్ని విస్మరించారు.
ఢోకా ఎవరిది ఈటల?
ఉద్యమ పార్టీ ఆరంభమైన రెండేళ్లకు పార్టీలోకి వచ్చిన ఈటల రాజేందర్ను సీఎం కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. 2004, 2008, 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. అంతేకాదు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో ఎన్నో పదవులు కట్టబెట్టారు. వీటితోపాటుగా సుమారు ఏడేండ్లపాటు మంత్రిగా అవకాశం కల్పించారు. కేబినెట్ హోదాలో 2014 నుంచి 2018 వరకు ఆర్థికశాఖ, 2019 నుంచి 2021 వరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు. ఒక సాధారణ నాయకున్ని తీసుకొచ్చి అతి తక్కువ కాలంలోనే ఎన్నో పోస్టులు ఇచ్చి.. మంత్రి పదవులు ఇచ్చిన పార్టీ అధిష్టానం మోసం చేసినట్లా..? లేక పదవులు ఇచ్చిన పార్టీనే కూలదోసేందుకు కుట్రలు, కుతంత్రాలు చేసిన వారు మోసం చేసినట్లా..? అన్న దానిపై ప్రస్తుతం ఎక్కడ చూసినా జోరుగా చర్చ జరుగుతున్నది. ప్రధానంగా సోషల్ మీడియాలో ఈ విషయం షేర్ అవుతున్నది. నిజానికి ఈటల రాజేందర్ రాక ముందు హుజూరాబాద్, కమలాపూర్ ప్రాంతాల్లో అనేక మంది నాయకులున్నారు. వారు ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. కానీ, వారెవ్వరికీ రాని ఎన్నో పదవులను పార్టీ అధినేత కేసీఆర్ కట్టబెట్టారు. భూకబ్జాలపై ఆరోపణలు వస్తే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ విచారణకు ఆదేశించారు. అప్పుడు ఈటల తన నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి, ఎలాగూ తన బండారం బయట పడుతుందని ముందుగానే గ్రహించి.. ‘గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పునుముకున్నట్లు’గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ముందుగానే పార్టీ నుంచి దూరమవుతున్నట్లు ప్రకటించిందెవరు? ఆ మరుక్షణమే బీజేపీలో చేరిందెవరు? ఏడేండ్లపాటు మంత్రివర్గంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఒక దిక్సూచి అన్న నోటి నుంచే.. తెలంగాణలో ఏ సంక్షేమ కార్యక్రమాలూ అమలు కావడం లేదని అబద్ధం ఆడిందెవరు? అనే ప్రశ్నలు తెరపైకి వస్తుండగా, ప్రజలు నిశితంగా చూస్తున్నారు. అంటే పదవులివ్వాలి.. వాటితో చేసే అక్రమాలను సహిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి మంచిది.. నిజాలను బయటకు చెబితే అది మోసపూరిత పార్టీ అవుతుంది.. ఇది ఈటల కథ.
దగాఎవరిది?
ఏళ్ల తరబడి పదవులను అనుభవించిన నాయకులే ప్రస్తుతం మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఒక పార్టీని, ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో అందరికీ అవకాశాలు ఇవ్వాలన్న సకల్పంతో పార్టీ ముందుకెళ్తున్నది. ఈ క్రమంలో భిన్న సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారముంటుంది. కానీ, పదవులిచ్చి.. కావాల్సిన చేయూతనిచ్చిన తర్వాత ఇతరులకు అవకాశాలు వస్తోంటే కొంత మంది జీర్ణించుకోలేని పరిస్థితి ఉన్నది. దీంతో పార్టీ ఇతరులకు అవకాశాలు ఇస్తున్నారని, తమకు ఇవ్వడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు. వారితోపాటు ఉద్యమంలో పాల్గొన్న చాలా మందికి.. ప్రస్తుతం పదువులు అనుభవించిన స్థాయిలో ఇంకా అవకాశాలు రావడం లేదన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తే.. దగా ఎవరిదో? ఢోకా ఎవరిదో? తెలిసిపోతుంది.