హుజూరాబాద్, నవంబర్ 22: వర్షాలు సమృద్ధిగా కురువడం, చెరువులు, బావుల్లోనూ నీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు ఉత్సాహంతో యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. అయితే ఆడ, మగ, లోకల్ సీడ్ వరి సాగు చేసే రైతులు నారు దశలోనే తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మున్ముందు చీడపీడలను కట్టడి చేయవచ్చునని, దిగుబడి సైతం పెరిగే అవకాశాలున్నాయని వ్యవసాయాధికారి సునీల్ కుమార్ పేర్కొన్నారు. వరి నారు చాలని రైతులు డ్రమ్ సీడర్తో సాగు చేస్తే మంచిదని, ఆలస్యంగా నారు పోస్తే వడగండ్ల వానలతో పంటకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు.
నారు పోసిన తర్వాత
అనురాధ కార్తె ఆరంభం నుంచి నారు పోయడం వంటి పనులు రైతులు చేస్తుంటారు. కార్తె ఈ నెల 19నుంచి ప్రారంభమైంది. అయితే పది నుంచి 20రోజుల మధ్యలో ఐదు గుంటల నారుమడిలో 2.2కిలోల యూరియా చల్లుకోవాలి. మొక్కలు రెండు, మూడు ఆకులు వచ్చే వరకు ఆరుతడి ఇవ్వాలి. ఆ తర్వాత మడిలో పలుచగా నీరు పెట్టాలి. యాసంగిలో జింక్ లోప లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి నారుమడిలో చల్లుకోవాలి.
చీడపీడల నుంచి రక్షణకు
విత్తనాలు చల్లిన 15 రోజుల తర్వాత ఆకులపై మొవ్వు పురుగు గుడ్లు కనిపించినా లేదా ఉల్లికోడు, తాటాకు పురుగు, తామర పురుగు ఆశించినా లీటర్ నీటికి 2.5మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ కలిపి పిచికారీ చేయాలి. నారు తీయడానికి వారం ముందు 800 గ్రాముల కార్బోఫ్యూరాన్-3జీ గుళికలు లేదా 250 గ్రాముల ఫోరేట్-10జీ గుళికలు వేస్తే మొవ్వు పురుగు, ఉల్లికోడును అరికట్టవచ్చు. పొడ, కాండం కుళ్లు తెగుళ్ల బారి నుంచి కాపాడుకునేందుకు కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.
చలి నుంచి కాపాడుకోవడం కోసం..
చలి తీవ్రత నుంచి వరి నారును కాపాడాలంటే రాత్రివేళల్లో వరి నారుమళ్లలో నీరు నిల్వ ఉంచొద్దు. దీనివల్ల నీరు చల్లబడి వరి నారుపై ప్రభావం చూపుతుంది. దీంతో నారు చనిపోతుంది. ఉదయం నీళ్లు పెట్టి సాయంత్రం తీసివేయాలి. నారు పెరిగే వరకు ఇలా చేయాలి. సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేసినట్లయితే త్వరగా నారు పెరుగుతుంది. మొదట సేంద్రియ ఎరువులు వేయకుంటే తర్వాత వర్మి కంపోస్టు, కోడి, గొర్రె ఎరువులను వేయాలి. దీనివల్ల మడుల్లో వేడి పెరిగి నారు చలిని కొంతవరకు తట్టుకుంటుంది. చలి ప్రభావం మరీ అధికంగా ఉంటే టార్పాలిన్ నారుకు తగలకుండా మడులపై రాత్రివేళల్లో కప్పాలి.
ఎరువులు వేయాలి
చలి ఎక్కువగా ఉంటే నారు ఎదుగుదల ఆగిపోతుంది. దీని కోసం ప్రతి రెండు గుంటల నారుమడికి అడుగు ఎరువుగా ఏడు కిలోల సూపర్ ఫాస్ఫేట్ కాని, రెండు కిలోల డీఏపీ లేదా రెండు కిలోల పొటాష్ లేదా కిలో జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. నారు పచ్చబడిన తర్వాత ఐదు కిలోల యూరియాను రెండు దఫాలుగా రెండున్నర కిలోల చొప్పున వేయాలి. విత్తిన 10-15 రోజుల తర్వాత పైపాటుగా రెండు కిలోల యూరియాను నారుమడిలో చల్లుకోవాలి. యాసంగిలో సాధారణంగా వరిలో జింక్ లోప లక్షణాలు కనిపిస్తాయి. జింకు లోప లక్షణాలు గమనిస్తే లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి.