హుజూరాబాద్, నవంబర్ 22 : మారిన ప్రస్తుత పరిస్థితుల్లో మానవుల ఆహారపుటలవాట్లలో అనేక మార్పులు వచ్చాయి.. సమతుల్యమైన ఆహారానికి బదులు బేకరీ, రెడీమేడ్ ఫుడ్ తీసుకుంటూ వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. షుగర్, బీపీ, కిడ్నీ, ఒబిసిటీ, కాలేయ సంబంధ రోగాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో చిరు ధాన్యాలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రకాల గింజలు, వాటిలో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుందాం..
జొన్న
జొన్నల్లో తెల్ల, పచ్చ, ఎర్ర జొన్నలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటికి మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మన దేశంలో ఏడు మెట్రిక్ టన్నుల జొన్నలను రైతులు పండిస్తున్నారు. వీటిలో ఇనుము, కాల్షియం, బీ విటమిన్లు, ఫోలిక్ అమ్లం పుష్కలంగా ఉండడంతో రక్తం వృద్ధి ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తిని ఇచ్చే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆహారంగా వీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జొన్నతో రొట్టెల తయారీ, ఉప్మా, అంబలి, పేలాలు, లడ్డు, అప్పడాలు వంటివి చేసుకోవచ్చు. జొన్నలు బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారం. వీటిలో తగినంత పీచు ఉండడంతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఒకపూట ఆహారంగా తీసుకుంటే వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఇవే కాకుండా వరిగలు, అండు కొర్రలు, అరికలు, సామలు, ఊదలు అనే చిరు ధాన్యాలు కూడా ఉంటాయి. అయితే, ఇవి మన దేశంలో అతితక్కువగా సాగు చేయడంతో లభించడం కష్టంగా ఉంటుంది. వీటిలో కూడా కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలలో మాదిరిగానే ఉన్నటువంటి విటమిన్లు, ప్రొటీన్లే ఉంటాయి.
రైతులను ప్రోత్సహిస్తున్నాం
చిరుధాన్యాలు సాగు చేయాలని ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే చాలాచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. చిరు ధాన్యాల సాగుతో దండిగా ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం మన జిల్లాలో వీటి సాగు చాలా స్వల్పంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే రైతులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. మున్ముందు వీటి సాగును పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.
కొర్రలు
ఇది గడ్డి జాతికి చెందినది. వీటి గింజలు చిన్నవిగా ఉండి పలుచని పొరతో కప్పబడి ఉంటాయి. వీటిని కొర్ర బియ్యంగానూ పిలుస్తుంటారు. ఈ గింజలు ఎరుపు, పసుపు, తెలుపు, నలుపు రంగల్లో ఉంటాయి. దంచి పొట్టును సులువుగా వేరు చేయవచ్చు. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో ఇవి తింటే ఒంటిలో కొవ్వు తగ్గుతుంది. వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కొర్ర అన్నం తినడం వల్ల మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఎంతో మంచిది. వీటిని ఉప్మా, గారెలు, దోశలు, గంజి చేసుకొని తీసుకోవచ్చు.
రాగులు
రాగులను సాధారణంగా పల్లి, కంది, మినుము వంటి పప్పు దినుసులతో పాటు అంతర పంటగా సాగు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా రాగి పంటను 38 లక్షల హెక్టార్లల్లో సాగు చేస్తున్నారని ఒక అంచనా ఉంది. ఈ పంటకు కీటకాలు, చీడపీడల సమస్య చాలా తక్కువ. రాగుల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత, కాల్షియం దండిగా ఉండడంతో ఎముకలు బలంగా ఉంటాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. మధుమేహ నియంత్రణకు దోహదపడుతాయి. రాయలసీమలో రాగి సంకటిని విరివిగా ఆహారంలో తీసుకుంటారు.
సజ్జలు
ఈ పంటను భారతీయులు వేల సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. దీనిని సంకటి చేసి తాగుతారు. ఆహారంలో తీసుకుంటే రక్త ప్రసరణ సజావుగా ఉంటుంది. అదే విధంగా మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.