సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, జూలై 6:గ్రూప్స్.. పోలీస్ ఇలా ఏ శిక్షణకైనా ప్రైవేట్లో అయితే వేలల్లో ఫీజులు కట్టాలి . వసతితో కూడిన ట్రైనింగ్ కావాలంటే పెద్ద మొత్తమే సమర్పించుకోవాలి. పేద, మధ్య తరగతి యువతకిది భారమే. కానీ పైసా ఖర్చులేకుండా.. ఎక్కడికో వెళ్లాల్సిన బాధ లేకుండా.. స్థానికంగానే సకల వసతులతో శిక్షణ ఇస్తూ సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్ ఉద్యోగార్థులకు బాసటగా నిలుస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లా కేంద్రంలో ఏర్పాటై, దిగ్విజయంగా నడుస్తున్నది. నిష్ణాతులైన అధ్యాపకులతో 120 మందికి శిక్షణను ఇవ్వడంతో పాటు, రెండు పూటలా అల్పాహారం.. మధ్యలో ఒకసారి తేనీటిని అందిస్తున్నది. అంతే కాదు ఉపకార వేతనాన్ని అందిస్తుండగా, ఉద్యోగార్థుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
నీళ్లు, నియామకాలే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగుల కలల సాకారానికి అడుగులు వేస్తున్నది. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు నిర్మించి జలగోసను తీర్చడమే కాదు లక్షలాదిగా కొలువులను భర్తీ చేస్తున్నది. ఇటీవలే 80వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడమే కాదు, స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తూ నిరుపేదలకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటైన బీసీ స్టడీ సర్కిల్ దిగ్విజయంగా నడుస్తున్నది. సకల వసతులు, నిష్ణాతులైన అధ్యాపకులతో అన్ని రకాల పోటీ పరీక్షలకు శిక్షణ అందుతున్నది.
గ్రూప్ పరీక్షలకు ఉచిత శిక్షణ
సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ పరీక్షలకు నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోచింగ్ సెంటర్ను నిర్వహిస్తుండగా, ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, తో పాటు గ్రూప్-4 , డీఎస్సీ, గురుకులాల్లో వివిధ రకాలైన ఉద్యోగాలకు దాదాపు 75 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. వీరితో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ పోటీపరీక్షలకు సైతం ఇస్తుండగా, 100 మంది గ్రూప్స్, మిగతా 20 మంది వివిధ ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటున్నారు. కేంద్రలో 13 మంది నిష్ణాతులైన అధ్యాపకులు ఉండగా, ఏడుగురు నాన్టీచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు.
రిజర్వేషన్ ప్రకారం ఎంపిక.. ఉపకార వేతనం
ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపకార వేతనాన్ని అందిస్తున్నారు. బీసీలకు 75 శాతం, ఈబీసీకి ఐదు శాతం, ఎస్సీలకు పది శాతం, ఎస్టీలకు ఐదు శాతం, మైనార్టీలకు ఐదు చొప్పున రిజర్వేషన్లతో యువతకు అవకాశం కల్పించారు. ఉపకార వేతనాన్ని అందిస్తున్నారు. గ్రూప్-1 శిక్షణ పొందే యువతకు ప్రతి నెలా 4 వేలు, ఎస్ఐ, కానిస్టేబుల్ శిక్షణ పొందే వారికి ప్రతి నెలా 2500 ఉపకార వేతనాన్ని అందిస్తున్నారు. ఇంకా ప్రతి రోజు రెండు పూటలా అల్పాహారం, ఒకసారి టీని అందిస్తున్నారు.
కలెక్టర్, ఎస్పీలతో విద్యార్థులకు ప్రేరణ
శిక్షణ పొందుతున్న నిరుద్యోగలకు బీసీ స్టడీ సర్కిల్లో మోటివేషన్(ప్రేరణ) తరగతులను నిర్వహిస్తున్నారు. ఎప్పటికపడు కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే భరోసా కల్పిస్తున్నారు. స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి అభ్యర్థనతో ఇక్కడికి వచ్చి తరగతులు నిర్వహిస్తూ కాన్ఫిడెన్స్ పెంచుతున్నారు.
మంత్రి కేటీఆర్ చొరవతోనే..
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన బీసీ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు వరంలాంటిది. శిక్షణ కాలంలో ఉద్యోగార్థులకు ప్రభుత్వం ప్రతి నెల ఉపకారవేతనాన్ని అందిస్తున్నది. విరామ సమయంలో ఉచిత శిక్షణ పొందే వారికి అల్పాహారం, టీని అందిస్తున్నాం. అంకితభావం కలిగిన నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పిస్తున్నాం. విజయతీరాలకు చేరిన అధికారులతో విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నాం. ఆన్లైన్ పరీక్షలో అర్హత పొందిన వారికే శిక్షణ కేంద్రంలో ప్రవేశాలు కల్పిస్తున్నాం. మంత్రి కేటీఆర్కు మా అందరి తరపున కృతజ్ఞతలు.
– జే వెంకటస్వామి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ (సిరిసిల్ల)
గ్రంథాలయం ఏర్పాటు
ఉద్యోగార్థుల కోసం గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. బాలురకు, బాలికలకు వేర్వేరుగా ఏర్పాటు చేసిన ఈ విజ్ఞాన బాంఢాగారంలో తెలుగు అకాడమీ పుస్తకాలు, దినపత్రికలతో పాటు స్టాండర్డ్ స్టడీ మెటీరియల్ను అందించే పుస్తకాలను తెప్పించి పెట్టారు.