రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ, జూలై 6: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని, ప్రోత్సాహం అందిస్తున్నదని రాష్ట్ర చేనేత జౌళిశాఖ కమిషనర్ బుద్ద ప్రకాశ్ జ్యోతి పేర్కొన్నారు. ఇటీవలే కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం సిరిసిల్లకు రాగా, కలెక్టర్ అనురాగ్ జయంతి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బుద్ద ప్రకాశ్ సిరిసిల్లలో విస్తృతంగా పర్యటించారు. సిరిసిల్లలోని పరిశ్రమలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వస్త్ర తయారీని క్షుణ్ణంగా పర్యవేక్షించారు. పెద్దూరులోని అప్పారెల్ పార్క్ను సందర్శించి, కార్మికులతో మాట్లాడారు. మహిళలతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వర్క్షెడ్లను పరిశీలించారు. వర్క్ టూ ఓనర్ పథకం ద్వారా ఒక్కో కార్మికుడు నాలుగు మరమగ్గాలు ఇచ్చే పథకాన్ని అడిగి తెలుసుకున్నారు. తర్వాత తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాసెస్ యూనిట్ను పరిశీలించారు. తర్వాత బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్పార్క్కు వెళ్లి, యూనిట్లను పరిశీలించి వస్ర్తాల తయారీపై కార్మికులను, యజమానులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్క్లోని అడ్మినిస్ట్రేటివ్ భవనంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్లలో తయారు చేస్తున్న బతుకమ్మ చీరలు, యూనిఫాం దుస్తులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్ పార్క్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఇక్కడ కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఏడీ వెంకటేశం, అసిస్టెంట్ సాగర్, అశోక్రావు, మంత్రి కేటీఆర్ పీఎస్ శ్రీనివాస్, టెక్స్టైల్ పార్క్ అధ్యక్షుడు అన్నల్దాస్ అనిల్ ఉన్నారు.
టెక్స్టైల్ పార్క్ సమస్యలను పరిష్కరించండి..
సిరిసిల్లలోని టెక్స్టైల్ పార్క్ సమస్యలను పరిష్కరించాలని బుధవారం చేనేత జౌళిశాఖ బుద్ద ప్రకాశ్కు టెక్స్టైల్ పార్క్ యజమానులు వినతి పత్రం అందజేశారు. పార్క్లోని ఓపెన్ ప్లాట్లకు ఓనర్ షిప్ మార్పిడి, చిన్నతరహా పరిశ్రమలకు ఓనర్ షిప్ మార్పిడి, యూనిట్ల అప్గ్రెడేషన్, కొత్త యూనిట్లు నెలకొల్పేవారికి అప్గ్రేడ్ చేయడం, పార్క్లో ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేయాలంటూ కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. అంతకు ముందు కార్మిక సంఘాల నాయకులు వర్క్ టూ ఓనర్ పథకాన్ని త్వరగా ప్రారంభించాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కమిషనర్కు వినతి పత్రాలు అందజేశారు.