తెలంగాణచౌక్, జూలై 6: గొల్లకుర్మల అభ్యున్నతే సర్కారు లక్ష్యమని, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధిలోకి తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పేర్కొన్నారు. గొల్ల, కుర్మలకు బతుకుబాట చూపేందుకు సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. నగరంలోని రెవెన్యూ గార్డెన్లో ఉమ్మడి జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో బుధవారం యాదవ సంఘం నాయకుడు కాల్వ నర్సయ్య యాదవ్ మూడో వర్ధంతి నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాదవులు నీతి నిజాయితీ, నమ్మకానికి మారు పేరు అని చెప్పారు. సమాజంలో యాదవులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. గొర్రెల పంపిణీ పథకంతో గొల్లకురుమల కుటుంబాల్లో వెలుగులు నింపామని, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు.
యాదవుల చైత్యనం కోసం పాటుపడిన కాల్వ నర్సయ్య యాదవ్ సేవలను కొనియాడారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా యాదవుల అభివృద్ధి కోసం పాటుపడిన కాల్వ నర్సయ్య యాదవ్ అడుగు జాడల్లో నడుచుకోవాలని సూచించారు. యాదవులకు ఐదు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటుతోపాటు రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవి కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని కొనియాడారు. తన నియోజకవర్గంలో యాదవ కులస్తులకు కుల సంఘ భవనాలకు స్థలం, నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. గొర్రెల, మేకల పెంపకందారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు మాట్లాడుతూ, యాదవులు రాజకీయంగా ఎదగాలన్నారు.
యాదవులు అభివృద్ధి చెందాలని పోరాటం చేసిన కాల్వ నర్సయ్య యాదవ్ ఆశయాలను ప్రభ్వుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యతోనే గుర్తింపు ఉంటుందని, సర్కారు ఏర్పాటు చేసిన గురుకులాల్లో యాదవ బిడ్డలు చేరి అభ్యసించాలని సూచించారు. యాదవుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ రాజారామ్ యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మయ్య, నగర కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, నూనె అంజయ్య యాదవ్, అఖిల యాదవ మహాసభ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గీతాంజలి యాదవ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ ఉమ, జక్కు నాగరాజు, భాషవేని మల్లేశంయాదవ్, నవీన్ యాదవ్, జిల్లాలోని యాదవ కులస్తులు, కుల సంఘాల జేఏసీ చైర్మన్ జీఎస్ ఆనంద్, కలర్ సత్తన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.