పెద్దపల్లి టౌన్ జూలై 5 : వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగ నేదునూరి శ్రావణ్ను అరెస్ట్ చేశారు. పెద్దపల్లి ఏసీపీ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొంగ వివరాలు, నేర చరిత్రను పెద్దపల్లి జోన్ ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ వివరించారు. పెద్దపల్లి పట్టణంలోని బండారికుంటలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేసిన నేదునూరి శ్రవణ్ను పట్టుకున్నట్లు తెలిపారు. విచారించగా తాను పలు దొంగతనాలకు పాల్పడ్డాడని తేలిందని వెల్లడించారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లికి చెందిన నిం దితుడు నేదునూరి శ్రావణ్ కొంతకాలంగా బైక్లు, చైన్ స్నాచింగ్లు చేస్తూ వాటిని అమ్మితే వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడన్నారు.
దొంగతనాలనే వృత్తిగా ఎంచుకుని మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పార్కింగ్ చేసిన బైక్లు, ఒంటరి మహిళలు నడుచుకుంటూ వెళ్తుండగా మెడలోని బంగారు ఆభరణాలు, చైన్ స్నాచింగ్ లాంటి దొంగతనాలకు పాల్పడేవాడని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైతం అనేక దొంగతనాలు చేసి జైలు శిక్ష పడిందని, అయి నా నిందితుడిలో మార్పురాలేదన్నారు. నిందితుడి నుంచి మంచిర్యాల, జగిత్యాల జిల్లా దర్మపురి, పెద్దపల్లి జిల్లా ధర్మారం, పెద్దపల్లి పట్టణంలో పట్టుకున్న ఆరు బైక్లు ఐదు తులాల 58గ్రాముల బంగారు ఆభరణాలు, పుస్తెల తాడును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దొంగను పట్టుకోవడంలో చాక చక్యంగా వ్యవహరించిన పెద్దపల్లి ఎస్ఐ కే. రాజేశ్, కానిస్టేబుళ్లు దుబాసి రమేశ్, సతీశ్, ప్రసాద్ను డీసీపీ అఖిల్ మహాజన్ అభినందించి రివార్డులు అందజేశారు. ఇక్కడ పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐలు రాజేశ్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.