వందశాతం గర్భిణుల వివరాలు నమోదు చేయాలి
టెలీకాన్ఫరెన్స్లో మంత్రి హరీశ్రావు
విద్యానగర్, జూలై 5: వందశాతం గర్భిణుల వివరాలు నమోదు చేయాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలోని ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో వంద శాతం గర్భిణుల వివరాల నమోదు, గర్భిణుల ఆరోగ్యం, పోషకాహారం, వ్యాధి నిరోధక టీకాలు, ప్రభుత్వ దవాఖానల్లో సిజేరియన్ ప్రసవాలు తగ్గించి సాధారణ కాన్పులు ప్రోత్సహించడం గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా, డయేరియా నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జువేరియా తెలిపారు.
సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలి
కొత్తపల్లి, జూలై 5 : ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల కోసం గర్భిణులకు అవగాహన కల్పించేలా వైద్యాధికారులు, సిబ్బంది, ఆశ కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జువేరియా సూచించారు. మంగళవారం కొత్తపల్లి పీహెచ్సీలో సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గర్భిణీ వివరాలను 12 వారాల్లోపు నమోదు చేయాలన్నారు. వారికి ప్రతినెలా ఐరన్, ఫోలిక్, కాల్షియం మాత్రలు అందించి హిమోగ్లోబిన్ లోపం లేకుండా చూడాలన్నారు. డెంగీ, మలేరియా, మెదడువాపు లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. అలాగే కరోనా వ్యాక్సినేషన్ను 100 శాతం పూర్తి చేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్, మెడికల్ ఆఫీసర్ వంశీకృష్ణ, వైద్య సిబ్బంది సంపత్, రవీందర్, జీవన్రెడ్డి, హిమబిందు, సులోచన తదితరులు పాల్గొన్నారు.