కరీంనగర్, జూలై 5 (నమస్తే తెలంగాణ): దళితబంధు యూనిట్లను వేగంగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్లస్టర్, గ్రౌండింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, బ్యాంకర్లతో దళితబంధు పథకంపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో యూనిట్ల మంజూరు కోసం చెక్ మెమోలు పంపించాలన్నారు. అలాగే మంజూరైన వాటిని గ్రౌండింగ్ చేయాలన్నారు.
ప్యాసింజర్ వాహనాలు పొందే వారు బ్యాడ్జి లైసెన్స్ తప్పకుండా కలిగి ఉండాలన్నారు. దళిత బంధు పథకం ద్వారా మంజూరైన డెయిరీ, ఇతర యూనిట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్ లాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా నెహ్రూ యువకేంద్రం కో-ఆర్డినేటర్ రాంబాబు, ఎల్డీఎం ఆంజనేయులు, హార్టికల్చర్ డీడీ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నతానియేల్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజమనోహర్ రావు, ఏడీ సర్వే లాండ్ రికార్డ్ అశోక్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, క్లస్టర్ అధికారులు, గ్రౌండింగ్ అధికారులు పాల్గొన్నారు.