సిరిసిల్ల టౌన్, జూలై 5: ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు సర్కారు దవాఖాన అంటేనే భయపడే పరిస్థితులు ఉండేవి. నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సేవల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించడంతో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల సర్కారు దవాఖానలో కార్పొరేట్కు దీటైన వసతులు సమకూరాయి. దీనికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న కేసీఆర్ కిట్ పథకంతో సర్కారు దవాఖాన ప్రసవాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తుండగా, మహిళల్లో హర్షం వ్యక్తమవుతున్నది. గత ఏప్రిల్లో సిరిసిల్ల జిల్లా దవాఖానలో సాధారణ ప్రసవంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన చింతల్ఠాణాకు చెందిన వసంత, దవాఖానలో సేవలను వివరిస్తూ లెటర్ రాశారని, ఇది దవాఖానల్లో సాధారణ కాన్పులకు ఇది ఒక కితాబు.. స్ఫూర్తి అని పేర్కొన్నారు.
సర్కారు వైద్య సేవలు భేష్..
సిరిసిల్ల సర్కారు దవాఖానలో వైద్య సేవలు చాలా బాగున్నాయంటూ గర్భిణి, ఆమె తండ్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు రాసిన లేఖ సర్కారు వైద్య సేవలకు తార్కాణంగా నిలుస్తున్నది. రాజన్నసిరిసిల్ల జిల్లా చింతల్ఠాణా ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన పోచయ్య ఏప్రిల్ మాసంలో తన కూతురు వసంతను సిరిసిల్ల సర్కారు దవాఖానకు కాన్పు కోసం తీసుకొచ్చాడు. ‘కంగారు పడాల్సిన అవసరం లేదు.. సాధారణ కాన్పు చేద్దాం.. మేమున్నాం’ అని చెప్పారు. అంతకుముందే మంత్రి హరీశ్రావు పలు టీవీల్లో సర్కారు వైద్య సేవల గురించి చెప్పిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ కాన్పు చేయించుకోగా పండంటి మగబిడ్డ పుట్టాడు. తల్లీ,బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దీంతో పోచయ్య, అతడి కూతురు వసంతలు పోస్టు కార్డు ద్వారా మంత్రి హరీశ్రావుకు ఉత్తరం రాశారు.
లేఖ సారాంశం ఇదే..
‘మంత్రి కేటీఆర్ సిరిసిల్ల సర్కారు దవాఖానలో మంచి సౌలత్లు కల్పించిండ్రు. ప్రసవానికి పైసా ఖర్చు లేదు. పైగా కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు. పైసా తీసుకోకుండా అమ్మ ఒడి వాహనంలో ఇంట్లో దింపిండ్రు. కడుపుకోతలు నివారించేందుకు మీరు పడుతున్న కష్టం చూసి నాకు, నా బిడ్డకు, మనవడికి కలిగిన మేలు అందరికీ తెలవాలన్న ఉద్దేశ్యంతో మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాస్తున్నా’ అని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా ‘సర్కారు దవాఖానలో సకల సౌలత్లు ఉన్నాయ్. కాన్పులకి ప్రభుత్వ దవాఖానకు రావాలి. నాకు జరిగిన మేలు అందరికీ జరగాలని పేర్కొన్నారు.
సాధారణ కాన్పులకు చైతన్యం: మంత్రి హరీశ్రావు
సిద్దిపేటలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, లెటర్ విషయాన్ని వెల్లడించారు. సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానలో కాన్పు చేయించుకున్న చింతల్ఠాణా ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన వసంత.. దవాఖాన సేవలను కొనియాడుతూ ఉత్తరం రాయడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ‘సర్కారు దవాఖానలో సకల సౌలత్లు ఉన్నాయ్. కాన్పులకి ప్రభుత్వ దవాఖానకే రావాలి. నాకు జరిగిన మేలు అందరికీ జరగాలని’ వివరిస్తూ రాసిన ఉత్తరం నాకు అందింది. చాలా సంతోషంగా ఉంది. వసంత నూరు వసంతాలు పిల్లాపాపలతో వర్ధిల్లాలని మంత్రి హరీశ్రావు కోరుకున్నారు. ఈ ఉత్తరం సాధారణ కాన్పులకు చైతన్య స్ఫూర్తిని ఇస్తుందని చెప్పారు.