గంగాధర, జూలై 3: మండలంలో ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నారు. ఇప్పటికే మండల స్థాయిలో అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి హరితహారం కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో మొక్కలు నాటడానికి స్థలాలను గుర్తించడంతో పాటు గుంతలు తవ్వాలని నిర్ణయించారు.
33 నర్సరీల ఏర్పాటు
మండలంలోని 33 గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. స్థానికంగా అవసరం ఉన్న మొక్కలకు సంబంధించిన విత్తనాలను సేకరించి నర్సరీల్లో నాటగా ఏపుగా పెరిగాయి. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ప్రతి రోజూ నీళ్లు పట్టడంతో పాటు గ్రీన్నెట్ ఏర్పాటు చేశారు. ప్రతి నర్సరీలో 10 వేల చొప్పున 3 లక్షల 30 వేల మొక్కలు పెంచుతున్నారు. లోకల్గా డిమాండ్ ఉన్న సీతాఫలం, చింత, అల్ల నేరేడు, మామిడి, జామ, దానిమ్మ వంటి పండ్ల మొక్కలు, గులాబీ, గన్నేరు, మందారం వంటి పూల మొక్కలతో పాటు వేప, కానుగ వంటి నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నారు. గ్రామాల్లో మొక్కలు నాటడానికి అనువైన స్థలాలను గుర్తించారు. దారులకు ఇరువైపులా మొక్కలు నాటడానికి ఉపాధిహామీ కూలీలతో గుంతలు తీయిస్తున్నారు. మొక్కలు ఏపుగా పెరుగడానికి అవసరమైన ట్రీగార్డులు, కర్రలు సిద్ధం చేశారు. అవెన్యూ, బండ్, బ్లాక్ ప్లాంటేషన్ చేయడంతో పాటు మంకీ ఫుడ్ కోర్టు, మియావాకీ పద్ధతిలో మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
లక్ష్యం మేరకు మొక్కలు నాటుతం
మండలంలో ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి, సంరక్షిస్తాం. గ్రామాల్లో ప్రజాప్రతినిధుల సహకారంతో స్థలాలను గుర్తించడంతో పాటు మొక్కలు నాటడానికి గుంతలు తీయిస్తున్నం. నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నయి. అందరి సహకారంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.
-చంద్రశేఖర్, ఏపీవో
ఏర్పాట్లు చేస్తున్నం
హరితహారంలో భాగంగా గంగాధర గ్రామ పంచాయతీ పరిధిలో 10 వేల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నం. నర్సరీలో మొక్కలు సిద్ధంగా ఉన్నయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.
-మడ్లపెల్లి గంగాధర్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు