రాజన్న సిరిసిల్ల, జూలై 2 (నమసే తెలంగాణ): గత సమైక్య పాలనలో కుదేలైన సర్కారు బడులకు టీఆర్ఎస్ ప్రభుత్వం జీవం పోసింది. అనేక సంస్కరణలు చేపట్టి కొత్తరూపు తెచ్చింది. ఇంకా ఆంగ్ల మాధ్యమ బోధనను కూడా ప్రవేశపెట్టింది. కొత్తగా ‘మన ఊరు‘ మనబడికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ బడులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నది. ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే 172 పాఠశాలలను ఎంపిక చేసి ఆధునిక హంగులతో తరగతి గదులను నిర్మించారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించారు.
ఇంకా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు దాతలు సైతం సర్కారు బడుల బాగుకు కదులుతున్నారు. ఇప్పటికే కోనరావుపేట మండలం మల్కపేటలో 2.50 కోట్లతో చల్మెడ జానకీదేవి పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేశారు. అలాగే, వీర్నపల్లి మండల కేంద్రంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5.70 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఇటీవలే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ భూమి పూజ చేశారు. ఈ క్రమంలో చాలా మంది విద్యార్థులు సర్కారు బడి బాట పడుతున్నారు. ఇప్పటికే చేపట్టిన ‘బడిబాట’తో వేలాది మంది విద్యార్థులు ప్రైవేట్ను వీడి సర్కారు బడిలో చేరారు. దీంతో జిల్లాలో అనేక పాఠశాలల్లో అడ్మిషన్లు దొరకని పరిస్థితి నెలకొంది.
మొత్తం ప్రైవేట్ విద్యార్థులే..
సర్కారులో అందిస్తున్న నాణ్యమైన విద్యాబోధనకు ఆకర్షితులై చేరిన వారిలో అధిక శాతం జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థులే ఉన్నారు. ఒక్క సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనే 899 మంది విద్యార్థులు ప్రైవేట్కు రాంరాం చెప్పి ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు. ఇక మండలాల వారీగా ప్రైవేట్ను వీడిన వారి సంఖ్యను పరిశీలిస్తే బోయినపల్లిలో 252, చందుర్తి 477, కోనరావుపేట 531, గంభీరావుపేట 557, ముస్తాబాద్ 301, వేములవాడ రూరల్ 144, వేములవాడ అర్బన్ 369, ఎల్లారెడ్డిపేట 467, సిరిసిల్ల 899, తంగళ్లపల్లి 568, వీర్నపల్లి 286, రుద్రంగి 108, ఇల్లంతకుంటల 264 మంది విద్యార్థులు ఉన్నారు.
5,223 మంది చేరిక
రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు బడులను బలోపేతం చేస్తూనే మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులకు సౌకర్యాలపై అవగాహన కల్పిస్తున్నది. అందులో భాగంగా విద్యాశాఖ బడి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత నెల 13 నుంచి 30 దాకా గ్రామం, పట్టణంలో బడి బాట నిర్వహించింది. ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో సక్సెస్ అయింది. దీంతో సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 5,223 మంది విద్యార్థులు ప్రైవేట్ను వీడి ప్రభుత్వ బడిలో చేరారు. 567 పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 40,884కి చేరింది. ఇంకా దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయని, అడ్మిషన్లు ఇచ్చే పరిస్థితి లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ప్రవేశాల కోసం పైరవీలు..
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 337 ప్రైమరీ, 38 ఉన్నత ప్రాథమిక, 3 మండల పరిషత్ ఉన్నత పాఠశాలలు 3, ఒక రెసిడెన్షియల్ బ్రిడ్జి స్కూల్, ఏడు మోడల్ స్కూళ్లు, 13 కస్తూర్బా, 7 సోషల్ వెల్ఫేర్, 2 గిరిజన ఆశ్రమ స్కూళ్లు, 2 టీఈఎంఆర్ఎస్, టీఎస్ఆర్ఈఐ సొసైటీ స్కూల్ 1, టీఎం ఆర్ఈఐ 2, మహాత్మాజ్యోతిభాపూలే 4, ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్లు 3 ఉండగా, రాష్ట్ర సర్కారు చర్యలతో ప్రభుత్వ విద్యాలయాలపై పిల్లలో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే మెజారిటీ స్కూళ్లలో అడ్మిషన్లు ఫుల్ అయిపోయాయి. జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ పాఠశాల, నెహ్రూనగర్, గోపాల్నగర్ పాఠశాలల్లో సీటు దొరకని పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో పిల్లల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులతో పైరవీలు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా తాము ఏమీ చేయలేమని, సీట్లు భర్తీ అయిపోయాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అడ్మిషన్లు ఇంకా వస్తున్నయ్..
జిల్లాలో చేపట్టిన బడిబాట సక్సెస్ అయింది. చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ను వీడి సర్కారు బడివైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంలోని అన్ని పాఠశాలలు విద్యార్థులతో నిండిపోయాయి. అయినప్పటికీ ఇంకా అడ్మిషన్లు వస్తూనే ఉన్నాయి. ఆంగ్లబోధనపై టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాం. 50 శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయి. వాటిని వెంట వెంటనే మండలాలకు సరఫరా చేస్తున్నాం. వారం రోజుల్లో పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తాం. మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వం, కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో బడులను బలోపేతం చేసి, నాణ్యమైన విద్యాబోధనతో రాష్ట్రంలో అగ్రగామిగా జిల్లాను నిలిపేందుకు విద్యాశాఖ కృషి చేస్తున్నది.
– రాధాకిషన్, డీఈఓ, రాజన్న సిరిసిల్ల