ఇల్లందకుంట, జూలై 2: రైతులు వానకాలం పంటల సాగులో పీఎస్బీని వినియోగించాలని, తద్వారా భూమిలో ఇప్పటికే నిల్వ ఉన్న భాస్వరం కరిగి మొక్కలకు అందుతుందని ఏఈవో మౌనిక తెలిపారు. మండలంలోని మర్రివాణిపల్లిలో శనివారం పీఎస్బీ వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోతాదుకు మించి డీఏపీ వాడితే భాస్వరం ఎక్కువై భూమిలో లభ్యం కాని రూపంలోకి మారుతుందని తెలిపారు. డీఏపీకి బదులుగా పీఎస్బీ (ఫాస్ఫరస్ సొల్యుబులైజింగ్ బ్యాక్టీరియా)ని ఉపయోగించడం వల్ల నిల్వ ఉన్న భాస్వరాన్ని మొక్కలకు అందుబాటులోకి తీసుకురావచ్చని, తద్వారా ఇతర ఎరువుల ఖర్చును తగ్గించుకోవచ్చని వివరించారు. దిగుబడి సైతం అధికంగా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, ఆర్బీఎస్ సభ్యుడు లక్ష్మారెడ్డి రైతులు పాల్గొన్నారు.
పెద్దంపల్లిలో..
జమ్మికుంట రూరల్, జూలై 2: రైతులు పంట క్షేత్రంలో భాస్వరాన్ని కరిగించే పీఎస్బీని వినియోగించాలని ఏఈవో లక్ష్మణ్ సూచించారు. మండలంలోని పెద్దంపల్లి గ్రా మంలో శనివారం కొత్త స్వామిరెడ్డి పంట పొలంలో పీఎస్బీపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈవో మాట్లాడుతూ పీఎస్బీ, సేంద్రియ ఎరువుల వినియోగంతో ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిపారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, పంట దిగుబడిని పెంచుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు నారాయణరెడ్డి, మోహన్రెడ్డి, అనిల్, భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.