జగిత్యాల రూరల్, జూన్ 29 : మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో జిల్లాస్థాయి వీఏవోల ఆత్మీయ సమ్మేళనాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై మాట్లాడారు. బీడీ కార్మికులకు పెన్షన్, అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, ఒంటరి మహిళలకు పెన్షన్, తదితర సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. టీఆర్ఎస్కేవీ అనుబంధ వీఏవోల సంఘాన్ని జిల్లాలో బలోపేతం చేయాలన్నారు. గతంలో ఎంసీహెచ్లను ఏర్పాటు చేయలేదని, కేవలం హైదరాబాద్లోని నీలోఫర్ దవాఖానలో మాత్రమే ఉండేదని, ప్రస్తుతం జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు పలు జిల్లాల్లో అనేక ఎంసీహెచ్ దవాఖానలను ఏర్పాటు చేశామన్నారు.
మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గ్రామీణ వ్యవస్థను పునర్నిర్మాణం చేసే కార్యక్రమమే పల్లె ప్రగతి అని, ఈ కార్యక్రమంతో గ్రామాల్లో ఎటు చూసినా పచ్చదనం వెల్లివిరుస్తున్నదన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు 93శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మహిళా శక్తి అజేయమైన శక్తి అని, మంచి ప్రభుత్వం కావాలన్నా, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా టీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చి కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలన్నారు. పట్టణాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని, జగిత్యాల జిల్లా కేంద్రంలోని టౌన్హాల్ 25ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక నిరుపయోగంగా ఉందని, అదే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.కోటి నిధులతో మరమ్మతులు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని చెప్పారు.
ప్రతిపక్ష నాయకులకు సమస్యలపై సోయి లేదని, అడుగడుగునా అభివృద్ధికి అడ్డం పడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా వీఏవోలు కృషి చేయాలన్నారు. సెర్ఫ్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహజ ప్రొడక్ట్స్ ద్వారా మార్కెట్లో అవసరమున్న సరుకులను మాత్రమే తయారు చేయాలన్నారు. జిల్లాలోని సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సహజ ఉత్పత్తులను సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫాంలను మహిళా సంఘాల ద్వారా కుట్టి స్వయంగా సరఫరా చేయాలని సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ వీఏవోల సేవలను తాము గుర్తిస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఏవోల గౌరవ వేతనం పెంచిందన్నారు.
2018ఎన్నికల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ కరోనా, తదితర కారణాల దృష్ట్యా కొంత ఆలస్యం జరిగిందన్నారు. జగిత్యాల జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారు చేసిన అంతర్గాం పసుపు యూనిట్కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి ఫ్లిప్కార్ట్కు అనుసంధానం చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ వీఏవోలను గత ప్రభుత్వాలు గుర్తించలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఉద్యోగులతో సమానంగా 30శాతం పీఆర్సీ పెంచిందన్నారు. సహజ ఉత్పత్తులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు.
అంగన్ వాడీ, ఆశా వర్కర్లలాగానే వీఏవోలకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉండాలన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ వీఏవోల వేతన సవరణపై సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మహిళలను గౌరవించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మహిళల పాత్ర కీలకమైందన్నారు. వీఏవోల ఇన్సూరెన్స్, డ్రెస్ కోడ్, తదితర సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దయామయుడన్నారు. అనంతరం వీరిని వీఏవోల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ వీఏవోల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి, ఆర్పీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మనుకోట సునిత, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టీఆర్ఎస్కేవీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్ రూప్సింగ్, టీఆర్ఎస్కేవీ నాయకుడు పవన్ బాబు, జిల్లా ఐకేపీ వీఏవోల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తిరుపతి, ప్రధాన కార్యదర్శి నారాయణ, కోశాధికారి సత్యనారాయణ, జిల్లా వీఏవోల కార్యవర్గ సభ్యులు, మండల, గ్రామ స్థాయి సంఘ సభ్యులు, తదితరులుపాల్గొన్నారు.