జమ్మికుంట, జూలై 9: చివరి ఆయకట్టు వరకూ సాగునీరందిస్తామని, అందుకే ఎస్సారెస్పీ కాలువల్లో పూడికతీత పనులు చేపట్టామని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని బిజిగిరిషరీఫ్ సమీపంలోని ఎస్సారెస్పీ డీబీఎం-16 కాలువ పూడికతీత పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయనే స్వయంగా ఎక్స్కవేటర్ సహాయంతో మట్టి, చెట్లు, చెత్తాచెదారాన్ని తొలగించారు. తర్వాత ఆరూరి రమేశ్ మాట్లాడారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుతో చివరి భూములకు నీరందిస్తున్నామని, జిల్లా సస్యశ్యామలం అవుతున్నదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడని కొనియాడారు. నిత్యం ఎస్పారెస్పీ కాలువల్లో నీళ్లు పారుతున్నాయని, పంటలు సమృద్ధిగా పండుతున్నాయని పేర్కొన్నారు. పచ్చని పొలాలతో పల్లెలు కళకళలాడుతున్నాయని, పంటల దిగుబడి భారీగా పెరిగిందని గుర్తుచేశారు. కాలువల్లో పేరుకుపోయిన మట్టి, మొక్కలను తొలగించాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. రైతులకు సాగునీటి సమస్య లేకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఆయన వెంట జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఎస్సారెస్పీ అధికారులు, సిబ్బంది, తదితరులున్నారు.