జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ శశాంక
కరీంనగర్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): జిల్లాలో కార్మికుల హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ కాలపరిమితి ముగిసినందున కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ను ఆదేశించారు. ఆర్డీవో స్థాయిలో సబ్ డివిజనల్ కమిటీ, మండల స్థాయిలో మండల కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. మండల కమిటీల్లో తహసీల్దార్, ఎస్ఐ, హెల్త్ సూపర్వైజర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎంఈవోలను నియమించాలని సూచించారు. మండల కమిటీ సభ్యులు జిల్లాలోని ఇటుక బట్టీలు, హోటళ్లు, రైస్ మిల్లులు, మైనింగ్ క్వారీలు, ఇతర పరిశ్రమల్లో పనిచేసే కూలీలకు కల్పిస్తున్న వసతులను పరిశీలించాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని కార్మికులందరికీ బీమా చేయించేలా చూడాలని ఆదేశించారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రమేశ్, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు ఆనంద్కుమార్, బెన్ షాలోం, ఏసీపీ సోమనాథం, పరిశ్రమల కేంద్రం జీఎం నవీన్కుమార్, ఎల్డీఎం లక్ష్మణ్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్థలాలను గుర్తించాలి
జిల్లాలో చేపల మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను గుర్తించి, ప్రతిపాదనలు ఇవ్వాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చేపల, కూరగాయల మార్కెట్ల నిర్మాణంపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్ఎండీ పరిధిలో చేపల రిటైల్, హోల్సేల్ మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. తిమ్మాపూర్ మండలంలో నుస్తులాపూర్, మహాత్మానగర్లో చేపల మార్కెట్ల ఏర్పాటు, వచ్చునూర్ వద్ద చేపల ల్యాండింగ్కు స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. గన్నేరువరం మండలానికి సంబంధించి సంగెం, గన్నేరువరంలో, సిరిసిల్ల బైపాస్ రోడ్డులో డ్యాం కట్ట పక్కన, ఎస్సారెస్పీ స్థలంలో చేపల రిటైల్ మార్కెట్ ఏర్పాటు, చేపల ల్యాండింగ్కు ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. అలాగే, ఎల్ఎండీ గెస్ట్హౌస్ ముందు ఉన్న ఎస్సారెస్పీ స్థలంలో ఆధునిక కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించాలని సూచించారు. ఉద్యానవన శాఖ ఉప సంచాలకుడు శ్రీనివాస్, మార్కెటింగ్ అధికారి పద్మావతి, ఎల్డీఎం లక్ష్మణ్, తహసీల్దార్లు శ్రీనివాస్, రాజ్కుమార్ పాల్గొన్నారు.