కరీంనగర్ కలెక్టరేట్, మే 27 : ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమైందని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి స్పష్టం చేశారు. జూన్ 4న నిర్వహించే లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్పై కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అప్రమత్తంగా విధులు నిర్వర్తి స్తేనే ఓట్ల లెక్కింపు పూర్తి చేయవచ్చన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ఉదయం 7 గంటలకే లెక్కింపు హాళ్లలోకి చేరుకోవాలని, ఎలాంటి సమస్యలు వచ్చినా అధికారుల దృష్టికి తేవాలని సూచించారు.
ఈవీఎంలు సక్రమంగా ఉన్నా యో లేదో చూడాలని, లెక్కింపు ఏజెంట్లతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు హాలు నుంచి ఎవరూ బయటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించబోరని, నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఈడీసీ, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ, ప్రతి టేబుల్ వద్ద ఓట్ల లెక్కింపు జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. అనంతరం ఓట్ల లెక్కింపుపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో లోక్సభ ఏఆర్వో కే మహేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.