కరీం‘నగరం’లో ఒలింపిక్ రన్ ఉత్సాహంగా సాగింది. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, క్రీడా శాఖ సంయుక్తంగా గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ కర్ణన్, మేయర్ సునీల్రావు జెండా ఊపి ప్రారంభించగా, వాకర్స్, విద్యార్థులు, క్రీడాకారులు.. ఇలా దాదాపు వెయ్యి మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అంబేద్కర్ స్టేడియం నుంచి తెలంగాణ చౌక్ వరకు.. తిరిగి స్టేడియం దాకా ఆరు కిలోమీటర్ల మేర పరుగు తీశారు. క్రీడలను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, ప్రతి ఒకరూ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్, మేయర్ పిలుపునిచ్చారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్