జమ్మికుంట/హుజూరాబాద్టౌన్ జూన్ 23: ‘ఇన్నాళ్లు ఆర్థిక ఇబ్బందులుపడ్డ దళితులను ధనికులుగా చేసేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ స్కీం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది..’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్తో కలిసి జమ్మికుంట, హుజూరాబాద్లో పర్యటించారు.
వీణవంక ప్రధాన రోడ్డులో దళితబంధు కింద ఏర్పాటు చేసుకున్న శ్రీ సాయి ట్రేడర్స్ (ఎలక్ట్రికల్స్ అండ్ ప్లంబింగ్) షాపును ప్రారంభించారు. లబ్ధిదారులు డాక్టర్ శ్యాం, డిష్ కుమార్తో ముచ్చటించారు. మడిపల్లి రోడ్డులోని మున్సిపల్ స్థలంలో కమిషనర్ సమ్మయ్య నేతృత్వంలో మొక్కలు నాటారు. హుజూరాబాద్ పట్టణం కరీంనగర్ రోడ్డులో దళితబంధు లబ్ధిదారు రాకేశ్కు చెందిన పీకేఆర్ కార్ డే కార్స్ యూనిట్ను ప్రారంభించారు.
ఆయాచోట్ల మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో సీఎం ప్రారంభించిన పథకం ఇక్కడి దళితుల బతుకుల్లో వెలుగులు నింపుతున్నదన్నారు. క్రమేణా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారని చెప్పారు. లబ్ధిదారులు వ్యాపారాల్లో రాణించి సీఎం కేసీఆర్ కలలు నెరవేర్చాలని కోరారు. కేంద్రం ఎత్తేసిన మోడల్ స్కూల్స్ లాంటి ఎన్నో పథకాలను రాష్ట్ర సర్కారు కొనసాగిస్తున్నదని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు భిన్నంగా వందరెట్ల మెరుగుతో స్కీంలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
కరోనా కాలంలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, ఆర్పీలు అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. జమ్మికుంట బల్దియా పనితీరు బాగున్నదని పాలకవర్గాన్ని మెచ్చుకున్నారు. ఇదేస్ఫూర్తితో ముందుకుసాగాలని సూచించారు. సమస్యలుంటే నేరుగా చెబితే పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సుందర జమ్మికుంట నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, ఎంపీడీవో కల్పన పాల్గొన్నారు.