కార్పొరేషన్, జూన్ 23: నగరంలో జూలై ఒకటి నుంచి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం ఆయన ప్లాస్టిక్ హోల్సేల్, రిటేల్ వ్యాపారులతో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్పై విధించిన నిషేధాజ్ఞల మేరకు నగరంలో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పర్యావరణానికి ఆటంకం కలిగించి, ప్రజల జీవన విధానానికి ప్రాణాంతకంగా మారిన ప్లాస్టిక్ను నగరంలో నిషేధించాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వాడినా, తయారు చేసినా, విక్రయించినా, నిల్వ చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని కోరారు. ప్లాస్టిక్ నిషేధంపై నగర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.
ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతామని పేర్కొన్నారు. బల్దియా ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ నిషేధంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు వ్యాపార వర్గాలు, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ త్రయంబకేశ్వర్, శానిటేషన్ సూపర్వైజర్ రాజమనోహర్, పర్యావరణ అధికారి స్వామి, శానిటేషన్ సిబ్బంది వెంకన్న, శ్రీధర్, గట్టు శ్రీనివాస్, శ్రీనివాస్, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.