పల్లె ప్రగతిని అందిపుచ్చుకుని ప్రగతి పథంలో దూసుకుపోతున్నది మండల కేంద్రమైన తిమ్మాపూర్. నాలుగు వేల జనాభాకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆచరణలో ఆదర్శంగా నిలుస్తోంది. అది వైకుంఠధామమైనా, పల్లె ప్రకృతి వనమైనా, సెగ్రిగేషన్ షెడ్డయినా అవెన్యూ ప్లాంటేషన్.. ఇలా ఏదైనా ఈ గ్రామాన్ని చూసి నేర్చుకోవాల్సిందే అన్న తరహాలో అభివృద్ధి చెందింది. ‘నమస్తే తెలంగాణ’ క్షేత్ర స్థాయి పరిశీలనలో గ్రామ ప్రగతి ప్రస్ఫుటంగా కనిపించింది. పల్లె ప్రగతి అమలు తీరును, ఈ కార్యక్రమం అమలైన తర్వాత వచ్చిన మార్పులను నిశితంగా పరిశీలించగా ఆసక్తికరమైన విషయాలు కనిపించాయి. ఐదో విడుత పల్లెప్రగతికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే వచ్చిన మార్పులు అద్భుతమని చెప్పవచ్చు. మంత్రులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులెవరు వచ్చినా ఈ గ్రామాన్ని సందర్శించి మోడల్ విలేజ్గా తీర్చిదిద్దారని అభినందిస్తున్నారంటే ఇక్కడ వచ్చిన మార్పులను అంచనా వేయవచ్చు.
– కరీంనగర్, మే 23 (నమస్తే తెలంగాణ)
పల్లె ప్రగతి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మండలకేంద్రమైన తిమ్మాపూర్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. ఒకప్పుడు అధ్వాన్నంగా ఉన్న గ్రామం ఇప్పుడు ఎక్కడ చూసినా సుందర దృశ్యాలకు నెలవుగా మారింది.
గ్రామంలో పల్లెప్రకృతి వనాలను ముచ్చటగా పెంచుతున్నారు. ఇప్పటికే వివిధ చోట్ల 20,283 మొక్కలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మానేరు తీరంలోని ఎకరం స్థలంలో 1,939 మొక్కలు పెంచుతున్నారు. దీనికి చేరువలోనే మండల స్థాయిలో చేపట్టిన బృహత్ పల్లెప్రకృతి వనం కోసం ఏడెకరాలు కేటాయించి 11,061 మొక్కలు పెంచుతున్నారు. కాకతీయ కాలువకు ఆనుకుని ఉన్న వైకుంఠధామంలోనూ ప్రకృతి పరవశించేలా పచ్చదనం కనిపిస్తున్నది. ఇక్కడ ఐదు బిట్లలో 1,851 మొక్కలు పెంచుతున్నారు.
ఇక రాజీవ్ రహదారి వెంట అవెన్యూ ప్లాంటేషన్ కింద 1,145 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. తిమ్మాపూర్ నుంచి రామకృష్ణకాలనీ రోడ్డుకు 1,085, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 506, గ్రామంలోని అంతర్గత రోడ్లలో 1,210, పోలీస్ స్టేషన్లో 200, ఎంపీడీవో ఆఫీస్లో 100, ఎస్ఆర్ఎస్పీ ముంపునకు గురికాని భూముల్లో 813, జోగయ్యపల్లిలో 340, సుభాష్నగర్ నుంచి యాదవులపల్లి రోడ్డుకు 784, యాదవులపల్లి పోచమ్మ వాటర్ ట్యాంక్ వద్ద 500, సెగ్రిగ్రేషన్ షెడ్డు వద్ద 100, ఇలా గ్రామం మొత్తంలో ఇప్పటికే 20,283 మొక్కలు జీవం పోసుకుని వృక్షాలుగా మారుతున్నాయి. నర్సరీలో మరో 11,650 మొక్కలను వచ్చే సీజన్లో నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. ప్రతి వారంలో రెండు రోజులు ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీరు పడుతుండడంతో పచ్చదనం పరుచుకుంటోంది.
తిమ్మాపూర్ అభివృద్ధిలో పంచాయతీ పాలకవర్గం గురించి కూడా చెప్పుకోవాల్సిందే. రాజకీయంగా విభేదాలు ఉన్నా అభివృద్ధిలో సర్పంచ్ నీలమ్మ-రాజయ్య ఆధ్వర్యంలో అంతా సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్రెడ్డి సైతం తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఇక మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా గ్రామాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని స్థానిక సర్పంచ్ అంటున్నారు. పంచాయతీ తీసుకున్న నిర్ణయాలను ఆచరణలో పెడుతూ కార్యదర్శి కోరుకంటి మహేందర్రావు తన వంతు పాత్రను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారు. దీని ఫలితమే గ్రామంలో పల్లె ప్రగతి వెల్లివిరుస్తోంది.
తిమ్మాపూర్ పారిశుధ్యానికి కేరాఫ్గా నిలుస్తున్నది. రోడ్లు, మురుగు కాలువలు శుభ్రంగా ఉంచుతున్నారు. పంచాయతీ కార్యదర్శి కోరుకంటి మహేందర్రావు ప్రత్యేక పర్యవేక్షణలో షెడ్యూల్ ప్రకారంగా పారిశుధ్య నిర్వహణ జరుగుతోంది. ఏ రోజు ఏ వార్డులో పనులు చేయాలో సిబ్బందికి టైం టేబుల్ కేటాయించారు. ట్రాక్టర్ సేవలు ఇందుకు సంపూర్ణంగా దోహద పడుతున్నాయి. వారంలో ఐదు రోజులు ట్రాక్టర్ను వినియోగించి వీధుల్లో చెత్తను సేకరించి సెగ్రిగ్రేషన్ షెడ్డుకు తరలిస్తున్నారు.
అక్కడ తడి పొడి చెత్తను వేరు చేసి కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు ముఖ్యంగా వేస్ట్ వాటర్ బాటిల్స్ను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. ప్రతి రెండు నెలలకు ఒక్కసారి అందుబాటులోకి వస్తున్న కంపోస్టు ఎరువును ఈ బాటిల్స్లో నింపి రూ.10 ఒకటి చొప్పున విక్రయిస్తున్నారు. దీని ద్వారా గ్రామ పంచాయతీకి అదనపు ఆదాయం వస్తోంది.
అంతే కాకుండా, గ్రామ పరిధిలో పెంచుతున్న మొక్కలకు ఈ ఎరువును అందిస్తుండడంతో అవి ఏపుగా పెరుగుతున్నాయి. ప్రతి వేస్టేజ్ని ఈ గ్రామంలో మళ్లీ వినియోగంలోకి తెస్తున్నారు. మరీ పనికి రాని ప్లాస్టిక్ వ్యర్థాలను వేలం వేసి విక్రయిస్తూ కూడా పంచాయతీకి ఆదాయం సమకూర్చుతున్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న పాలకవర్గం రూ.కోటి వ్యయంతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించారు.
పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తిమ్మాపూర్ పంచాయతీ పునికి పుచ్చుకుంది. పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలను గ్రామస్తులు గౌరవిస్తున్నారు. గ్రామాభివృద్ధిలో వారి సహకారం కూడా ఎంతో ఉందని పంచాయతీ కార్యదర్శి చెబుతున్నారు. మొదట్లో రోడ్లపై చెత్తా చెదారం వేసేవాళ్లని, అలాంటి వారికి జరిమానా విధించడం కంటే అవగాహన కల్పించేందుకే ప్రాధాన్యత ఇచ్చామని, విధి లేక కొందరికి ఫైన్లు విధించడంతో క్రమంగా మార్పు కనిపించిందని చెప్పారు. ఇప్పుడు ట్రాక్టర్ వస్తేగానీ చెత్త బుట్టలు బయటికి రావడం లేదు.
రోడ్లపై, మురుగు కాలువల్లో చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం లేదు. ఫలితంగా రోడ్లన్నీ అద్దంలా మెరిసి పోతున్నాయి. ఇదొక్కటే కాకుండా ఇంటి పన్నులు, నీటి చార్జీలను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారు. గ్రామం మొత్తంలో 450కి పైగా ఉన్న వీధి దీపాలకు ఎల్ఈడీ లైట్లను అమర్చడంతో రాత్రి వేళ పట్టణ శోభను సంతరించుకుంటున్నది. పారిశుధ్యం సంపూర్ణంగా నిర్వహిస్తుండడంతో గడిచిన రెండేళ్లలో విష జ్వరాలు దాదాపుగా తగ్గిపోయాయి.
గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం చూడ ముచ్చటగా ఉంది. గతంలో సొంత స్థలాలు లేని వాళ్లు చనిపోతే దహన సంస్కారాలకు చోటు లేక ఏ కాలువ గట్టుకో అంతిమ సంస్కారాలు నిర్వహించే వారు. కానీ, ఇప్పుడు కులాలకతీతంగా ఇక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఊరికి కాస్త దూరంగా ఉండడంలో సర్పంచు దుండ్ర నీలమ్మ-రాజయ్య ఒక వైకుంఠ రథాన్ని విరాళంగా ఇచ్చారు.
ఇదంతా ఒకెత్తయితే ఇందులో 1,800లకు పైగా నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన వారు తమ దుఃఖాన్ని మర్చిపోయే విధంగా వైకుంఠధామాన్ని తీర్చి దిద్దారు. ప్రకృతి మధ్య అంతిమ సంస్కారాలు చేసి, అక్కడే స్నానాలు చేసుకునేందుకు మెరుగైన సదుపాయాలు కల్పించారు.
గ్రామానికి ఆదాయం సమకూర్చే మార్గాలను అన్వేషించిన పంచాయతీ మామిడి తోటను పెంచుతున్నది. దాదాపు ఎకరం ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి హరితహారంలో భాగంగా రెండేళ్ల క్రితం 150 మామిడి మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. కొన్ని చెట్లు కాయలు కూడా కాస్తున్నాయి. మరో ఏడాదిలో అన్ని చెట్లు కాతనిస్తాయని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.
రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా విజిట్ కోసం ఎవరు వచ్చినా జిల్లా యంత్రాంగం మొదటగా ఎంచుకునేది ఈ గ్రామాన్నే. సీఎంవో కార్యాలయ అధికారులు స్మితా సబర్వాల్, ప్రియాంకా వర్గీస్ ఈ గ్రామాన్ని పలుసార్లు సందర్శించి పల్లె ప్రగతి పనులను మెచ్చుకున్నారు. ఏకంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి అభినందించారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ ఇక్కడి అభివృద్ధిని తెలుసుకుని స్వయంగా వచ్చి పరిశీలించారు. పాలకవర్గాన్ని, సిబ్బందిని అభినందించారు. ట్రైనీ ఐఏఎస్ అధికారులు, ప్రత్యేక స్కాడ్స్ ఎవరు వచ్చినా తిమ్మాపూర్ను సందర్శించడం తప్పని సరి చేసుకున్నారు.
పల్లె ప్రగతి స్ఫూర్తితో గ్రామంలో ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాం. ఒక్కో కార్యక్రమంలో ఒక్కో అంశానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఈసారి వచ్చే పల్లె ప్రగతిలో ప్లాస్టిక్ నిషేధం విధించుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నాం. గ్రామంలో పల్లె ప్రగతి ఇంత సక్సెస్ అయ్యిందంటే దానికి కారణం మా పాలకవర్గం, గ్రామస్తులే. మా సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించాలి.
ఉదయం 5 గంటల నుంచే గ్రామంలో విధులు ప్రారంభిస్తారు. వారంలో ఐదు రోజులు చెత్త సేకరణలో చాలా కష్టపడి పని చేస్తుంటారు. మిగతా రెండు రోజులు చెట్ల సంరక్షణలో ఉంటారు. చాలా మంది విజిటర్స్ అభినందించారు. ఇంకా ఎలా చేయాలో సలహాలు, సూచనలు చేశారు. వాటిని కూడా ఆచరణలో పెడుతున్నాం.
– కోరుకంటి మహేందర్రావు, పంచాయతీ కార్యదర్శి
పల్లె ప్రగతితో మా ఊళ్లో మార్పు వచ్చింది. అందరికీ ఒక పద్ధతి అలవాటైంది. ఒకప్పుడు ఎక్కడ చూసినా రోడ్ల మీద, డ్రైనేజీలల్ల చెత్తా చెదారం కనిపించేదిది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇండ్లలోనే చెత్త బుట్టలల్ల ఏసి పంచాయతీ ట్రాక్టర్ రాంగనే ఇస్తున్నరు. దానిని డంప్ యార్డుకు తరలిస్తున్నం. ఇగ ఊళ్లె ఎట్ల చెత్త పడ్తది. అందరు సహకరిస్తున్నరు. మా ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీటీసీ, మా వార్డు మెంబర్ల సహకారంతోనే ఊరిని ఇంత మంచిగ చేసినం.
– దుండ్ర నీలమ్మ రాజయ్య, సర్పంచ్
ట్రాక్టర్ వాడలపొంటి పోంగనే అందరూ లేసి ఇంట్ల జమైన చెత్త తెచ్చి ఇస్తరు. మా సిబ్బందికి మంచిగ సహకరిస్తరు. పొద్దుగాల లేసినంకనే ఊళ్లె వడ్తం. రోజూ మంచిగనే చెత్త జమైతది. ఇంత చెత్త ఇన్ని రోజులు ఎక్కడ వోసిండ్రనిపిస్తది. చెత్త ట్రాక్టర్లవోసుకుని డంప్యార్డుకు, షెడ్డుకు తీస్కపోతం. తడి, పొడి చెత్త దేంది దాన్కే తీసేస్తం. ప్లాస్టిక్ ముక్కలు ఇంకేమన్న ఉంటే దేంది దాన్కే ఏస్తం. ఊళ్లె ఒక్క చెత్త కుప్ప సుతం కనవడద్దని మా సర్పంచి, కార్యదర్శి సార్ వాడల పొంటి తిరిగి చూత్తరు.
– నాయిని కొంరయ్య, ట్రాక్టర్ డ్రైవర్