కార్పొరేషన్, మే 23: సీఎం కేసీఆర్ దేశ పర్యటనతో తమ పీఠాలు ఎక్కడ కదులుతాయోన్న భయంతో బీజేపీ నాయకులు డిప్రెషన్లోకి పోయి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని నగర మేయర్ వై.సునీల్రావు విమర్శించారు. 8 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి చెప్పుకునేందుకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు లేక అనవసరమైన విషయాలను తెరమీదకు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రజలు వీరికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ మూడేళ్లుగా నియోజకవర్గానికి ఏం చేయకుండా ముఖం చాటేశారని దుయ్యబట్టారు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ పట్ల సంస్కారం లేకుండా చేస్తున్న వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ రాజధాని వద్ద రైతులు సాగించిన ఉద్యమంలో మృతి చెందిన రైతులకు ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. కనీసం ఈ విషయం కూడా తెలియకుండా బండి సంజయ్ మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. 8 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. రైతులకు సాగునీరు, 24 గంటల కరెంటు, పంటకు మద్దతు ధర అందిస్తున్నారని తెలిపారు.
రికార్డు స్థాయిలో రూ. 55 వేల కోట్ల రైతుబంధు అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతుబీమా అందించి రైతు కుటుంబాలకు ధీమా కల్పించారని తెలిపారు. కేంద్రం ధాన్యం కోనుగోలు విషయంలో సహకరించకున్నా రాష్ట్రంలో తడిచిన ధాన్యం సైతం కోనుగోలు చేస్తామని ధైర్యంగా చెప్పిన సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. బీజేపీ నాయకత్వం వ్యాపారుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నదని, గుజరాతీ వ్యాపారులకు కొమ్ముకాస్తున్నదని ఆరోపించారు.
8 ఏళ్లుగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్పై సెస్ పెంచలేదని, ఆ పరిజ్ఞానం కూడా లేకుండా బండి సంజయ్ మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి ఇప్పుడు అరకొరగా తగ్గించి ఎంతో తగ్గించామని చెప్పుకోవడమంత దౌర్భాగ్యం మరోటి లేదన్నారు. కేంద్రంలోని నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ దేశ పర్యటన చేస్తుంటే తమ పీఠాలు కదిలిపోతాయన్న భయంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా ఫించన్ల కింద ఏటా రూ. 12 వేల కోట్లు వ్యయం చేస్తున్నదని, వీటిలో కేంద్రం వాటా రూ. 240 కోట్లు మాత్రమేనని తెలిపారు.
రాష్ట్రంలో 11 లక్షల కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అందించామన్నారు. గతంలోని కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించి ఉద్యోగావకాశాలు కల్పిస్తే మోదీ మాత్రం ఉన్న ప్రభుత్వ సంస్థలను మూసి వేస్తున్నారని విమర్శించారు. కొత్తగా ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ప్రారంభించలేకపోయారని దుయ్యబట్టారు. దద్దమ్మలాగా మారి ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేని బండి సంజయ్ వరి వేయండి, కొనుగోలు చేయిస్తానని చెప్పి ముఖం చాటేశారని దుయ్యబట్టారు. వీటి అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని, వారే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, వాల రమణారావు, తోట రాములు, బండారి వేణు, టీఆర్ఎస్ నాయకులు వంగల పవన్, ఎడ్ల అశోక్, ఉయ్యాల శ్రీనివాస్గౌడ్, అనిల్, బాలరాజ్ పాల్గొన్నారు.