జమ్మికుంట, మే23: ఈటల రాజేందర్ ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ రాజకీయం చేయడంలో దిట్టని, తన ఉనికి కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సోమవారం జమ్మికుంటలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడే జమ్మికుంట పాత మార్కెట్లో రైతు బజార్ను రూ.కోటి 40లక్షలతో నిర్మించి, ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. కూరగాయల మార్కెట్ను రైతు బజార్కు మార్చాలని అధికారులను ఆదేశించారని చెప్పారు.
అప్పడలా మా ట్లాడి.. ఇప్పుడు రైతు బజార్కు రాని కూరగాయల వ్యాపారులకు మద్దతు పలుకడాన్ని తప్పుబట్టారు. రైతు బజార్ను కేవలం కమీషన్ల కోస మే నిర్మించారా..? చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణ జనాభాకు అనుగుణంగా కూరగాయల వ్యాపారులు, వినియోగదారులకు ఇబ్బంది కలుగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఇలాంటి చౌ కబారు రాజకీయం చేస్తూ వ్యాపారులను రెచ్చగొట్టడం తగదన్నారు. రెండునాల్కల ధోరణి వీడాలని హితవు పలికారు.
ఈటల అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కూరగాయల వ్యాపారులతో మాట్లాడుతామని, సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. రైతు బజార్లోనే క్రయ, విక్రయాలు జరిగేలా ఒప్పిస్తామని చెప్పారు. దళిత బంధు పథకం దేశానికే దిక్సూచీగా నిలిచిందని, యూనిట్లు బీజేపీ కార్యకర్తలకు ఇవ్వడం లేదని ఈటల మాట్లాడడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఇటీవల ఇక యూనిట్ను ఈటల ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.
పార్టీలకతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా రూ.10లక్షలు అందిస్తున్నామని, కార్యకర్తలను అడిగి తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఈటల బీజేపీ పరువు తీస్తున్నారని, ఆ పార్టీ నాయకులు గుర్తించాలని సూచించారు. సీఎం కేసీఆర్ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, భరతం పడతామని హెచ్చరించారు. వ్యాపారులను కన్ఫ్యూజ్ చేసిన ఈటల.. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, కౌన్సిలర్లు పొనగంటి మల్లయ్య, దిడ్డి రాము, కూతాడి రాజయ్య, దయ్యాల శ్రీనివాస్, గాజుల భాస్కర్, శ్రీపతి నరేశ్, మారెపల్లి భిక్షపతి, నాయకులు వెంకటేశ్, రమేశ్, శివశంకర్, వైకుంఠం ఉన్నారు.