ఉమ్మడి జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 231 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, తొలి రోజు 39,168 మంది విద్యార్థులకు గాను 38,938 మంది హాజరయ్యారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహించగా, అర గంట ముందుగానే విద్యార్థులను అనుమతించారు. మాస్ కాపీయింగ్ పాల్పడకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోగా పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్తో పాటు విద్యాధికారులు తనిఖీ చేశారు.
కమాన్చౌరస్తా/జగిత్యాల టౌన్/పెద్దపల్లి కమాన్/తెలంగాణ చౌక్, మే 23: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహించగా, అరగంట ముందుగానే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఈ పరీక్షల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 231 కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటి రోజు ఫస్ట్లాంగ్వేజ్కు 39,168 మంది విద్యార్థులకు గాను 38,938 మంది హాజరయ్యారు.
అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. కాగా కరీంనగర్ జిల్లాలో 80 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా తొలి రోజు తెలుగు పేపర్-1కు 12,797 మంది విద్యార్థులకు గాను 12,693మంది హాజరయ్యారని జిల్లా విద్యాధికారి సీహెచ్వీఎస్ జనార్దన్రావు, ఏసీ వాసవి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో ఓల్డ్ హైస్కూల్, వాణీనికేతన్ బాలవికాస్ పాఠశాలల్లో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తనిఖీ చేశారు.
జగిత్యాల జిల్లాలో 67 పరీక్షా కేంద్రాల్లో మొదటి రోజు తెలుగు పేపర్-1కు 11,826 మంది విద్యార్థులకు గాను 11,784 మంది హాజరయ్యారని జిల్లా విద్యాధికారి డాక్టర్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 22 పరీక్షా కేంద్రాలను జగిత్యాల విద్యాధికారి, ఐదు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ జీ రవి సందర్శించారు. పెద్దపల్లి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 8,164 మంది విద్యార్థులకు గాను 8,120 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి డీ మాధవి తెలిపారు. రామగుండంలోని పది పరీక్షా కేంద్రాలను డీఈవో మాధవి సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35 పరీక్షా కేంద్రాల్లో 6,381 మందికి గాను 6341 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి డీ రాధాకిషన్ వెల్లడించారు.