వజ్రోత్సవ స్ఫూర్తి వెల్లివిరుస్తున్నది. రోజుకో కార్యక్రమంతో జనం దేశభక్తిని చాటుతున్నది. శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సేవానిరతిని చాటారు. అనాథ, వృద్ధాశ్రమాల బాట పట్టి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనాథలు, వృద్ధులకు పండ్లు, స్వీట్లు, రగ్గులు పంపిణీ చేసి, ‘మేమున్నా’మంటూ భరోసానిచ్చారు. కరీంనగర్లోని ఎంసీహెచ్లో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ కర్ణన్తో కలిసి బాలింతలకు మంత్రి గంగుల కమలాకర్ పండ్లు, కేసీఆర్ కిట్లు అందజేశారు. నగరంలోని ఓల్డ్డేజ్ హోంలో కలెక్టర్ కర్ణన్ ఫ్రూట్స్ అందించగా,మహాత్మానగర్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సీపీ సత్యనారాయణ క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
కరీంనగర్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ దవాఖానలు, అనాథ, వృద్ధాశ్రమాల బాట పట్టి, వృద్ధు లు, అనాథలకు భరోసా కల్పించారు. పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.
కరీంనగర్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్రావు తదితరులు కలిసి గర్భిణులు, బాలింతలు, రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కరీంనగర్లోని ఓల్డేజ్ హోంలో వృద్ధులు, దివ్యాంగులకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జిల్లా అధికారులతో కలిసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, డీఎంహెచ్వో జువేరియా తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
చొప్పదండి పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, ఎంపీపీ చిలుక రవీందర్ తదితరులు పండ్లు పంపిణీ చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానాలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక రోగులకు పండ్లు పంపిణీ చేశారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని శ్రీచైతన్య కళాశాలలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సీపీ సత్యనారాయణ గ్రామీణ క్రీడా పోటీలను ప్రారంభించగా, హోరాహోరీగా సాగాయి.