విద్యానగర్, ఆగస్టు 19: జిల్లాలోని గర్భిణులను గుర్తించి వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గర్భిణుల నమోదు, సీజనల్ వ్యాధులు, రక్త హీనత అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ సూపర్వైజర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి గర్భిణులను గుర్తించి వివరాలు నమోదు చేయాలన్నారు. పట్టణాల్లో గర్భిణుల వివరాలు నమోదు వెనుకబడినందున స్త్రీ శిశు సంక్షేమ, ఆరోగ్య శాఖల సిబ్బంది పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారుల సమన్వయంతో వందశాతం నమోదు జరుగాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో సీజనల్ వ్యాధులు, డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. రక్తహీనత పరీక్షలు నిర్వహించి ఏ శీల్డ్ యాప్లో నమోదు చేయాలన్నారు. సాధారణ రక్తహీనత, తీవ్రస్థాయి రక్త హీనత ఉన్న వారిని గుర్తించి ఐరన్ మాత్రలు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా వైద్యాధికారి జవేరియా, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, స్త్రీ శిశు సంక్షేమ అధికారి పద్మావతి, సీడీపీవోలు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, అంగన్వాడీ సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.