స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు ప్రజాప్రతినిధులు, నాయకులు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి ఔదార్యాన్ని చాటారు. పేదలకు అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేశారు.
జమ్మికుంట, ఆగస్టు 19: పట్టణంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి స్పందన అనాథాశ్రమం, ప్రభుత్వ దవాఖానలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నాకోటి, కౌన్సిలర్లు పండ్లు, పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. తర్వాత వక్తలు మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం అందించిన మహనీయులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. మహనీయుల త్యాగఫలమే స్వాతంత్య్రమని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో పలువురు కౌన్సిలర్లు, ప్రధానోపాధ్యాయులు, దవాఖాన వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందకుంట, ఆగస్టు 19: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా పండ్లు పంపిణీ చేశారు. రోగులకు వైద్యురాలు జ్యోత్స్న వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత, ఎంపీపీ పావని, వైద్యులు శ్రీదేవి, అఖిల్, సీడీపీవో భాగ్యలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్రెడ్డితో పాటు వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
సైదాపూర్, ఆగస్టు 19: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గర్భిణులు, రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చంద శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాయిత రాములు మాట్లాడుతూ సర్కారు దవాఖానలో మెరుగైన వైద్యం అందుతున్నదని, ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు శ్రీనివాస్, అరుణ్, సుస్మిత, వెన్కేపల్లి సర్పంచ్ కొండ గణేశ్, సూపర్వైజర్ సమ్మయ్య, హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
వీణవంక, ఆగస్టు 19: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, చల్లూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితోనే ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు శ్యాంప్రసాద్, శ్రావణ్కుమార్, రాధాకృష్ణ, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, వైద్యసిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్, ఆగస్టు 19: మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వతంత్ర వజ్రోత్సవాలు, ఏఎంసీ డే సందర్భంగా గర్భిణులకు పీహెచ్సీ వైద్యుడు తులసీదాస్ వైద్య పరీక్షలను నిర్వహించారు. వారికి ఎంపీటీసీ మర్రి మల్లేశం పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శంకర్రెడ్డి, సూపర్వైజర్లు స్వరూప, సాంబయ్యతో పాటు ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
అన్ని మతాలకంటే మానవత్వం చాలా గొప్పదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఏరియా దవాఖానలో శుక్రవారం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం ద్వారా పొందే సంతృప్తి గురించి మాటల్లో చెప్పలేమన్నారు. పేదలకు చేయూతనందిస్తే మన గురించి ఎళ్లకాలం తలచుకుంటారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇరుమల్ల రాణి, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్లు శ్రీనివాస్, సుశీల తదితరులు పాల్గొన్నారు.