వేములవాడ, ఆగస్టు 19 : వేములవాడ రాజన్న క్షేత్రంలో వృక్ష యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఎనిమిదో విడుత హరితహారంలో భాగంగా 1500 మొక్కలు నాటాలని నిర్ణయించారు. దేవాదాయశాఖ కమిషర్ అనిల్కుమార్, రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు వారం రోజుల నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకు 2.80 లక్షలు వెచ్చిస్తున్నారు.
జగిత్యాల బస్టాండ్ కమాన్ నుంచి వట్టెంల వరకు మొక్కలు నాటుతున్నారు. ఎండిపోయిన వాటి స్థానంలో కొత్తగా మొక్కలు పెడుతున్నారు. ఇప్పటికే వెయ్యి వరకు నాటగా.. మరో రెండు, మూడు రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. వేప, రావి, కానుగ, జువ్వి, మర్రి మొక్కలను నాటుతున్నామని పేర్కొన్నారు. సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని ఈవో చెప్పారు.
ఎనిమిదో విడుత హరితహరంలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ పరిధిలోని భూముల్లో 1500 మొక్కలు నాటాలని నిర్ణయించినం. ఇందులో భాగంగా వారం క్రితమే వృక్ష యజ్ఞాన్ని ప్రారంభించినం. ఇప్పటికే వెయ్యి వరకు మొక్కలు నాటినం. ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి పెట్టినం. మరో రెండు, మూడు రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటం. నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతం.
-రమాదేవి, రాజన్న ఆలయ కార్యనిర్వహణాధికారి