హుజురాబాద్ టౌన్, ఆగస్టు 19: కృష్ణాష్టమి కావడంతో ఇద్దరు పిల్లలకు గోపిక, కృష్ణుడి వేషధారణ వేసి భర్త బైక్పై స్కూల్కు పంపించింది. తాను నర్సుగా పనిచేస్తున్న దవాఖానకు వెళ్తున్నానని చెప్పింది. కానీ, అంతలోనే బలవన్మరణానికి పాల్పడ్డది. పోలీసుల వివరాల ప్రకా రం.. భూపాలిపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మెట్టుపల్లికి చెందిన గోకారపు శ్రీనివాస్కు అదే జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలకు చెందిన సంధ్య(33)తో 13 ఏండ్ల క్రితం వివాహమైం ది.
శ్రీనివాస్ బతుకు దెరువు కోసం పెళ్లయిన కొన్ని నెలలకే హుజూరాబాద్కు వచ్చాడు. 13 ఏండ్లుగా వీరు హుజూరాబాద్లోని సూపర్బజార్, బండ అంకూస్ కాలనీలో అద్దె ఇండ్లల్లో నివసించారు. నాలుగు నెలల క్రితం ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వీరికి పాప లిఖిత(8), బాబు లతిక్(4) ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలో పాప నాలుగో తరగతి, బాబు నర్స రీ చదువుతున్నారు. శ్రీనివాస్ స్థానికంగా బండ ల పాలిష్ పని చేస్తుండగా, సంధ్య పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నది.
శుక్రవారం ఉదయం పిల్లలను భర్త బైక్పై పాఠశాలకు పంపించింది. తాను దవాఖానకు వెళ్తున్నానని భర్తకు చెప్పింది. కానీ, దవాఖానకు వెళ్లకుండా బెడ్రూంలో ఉరేసుకున్నది. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన భర్త శ్రీనివాస్ తలుపులు తీయాలని భార్యను పిలువగా స్పందన రాలేదు. ఇంటి వెనుక నుంచి తలుపులు తొలగించి చూడగా.. బెడ్రూంలో చీరతో ఉరేసుకొని కనిపించింది.
వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు చేరుకొని సంధ్య తల్లిదండ్రులకు తెలియజేశారు. అయితే భర్త, పిల్లలతో అన్యోన్యంగా ఉండే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటో తెలియలేదు. భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు జరిగి ఉంటాయా..? లేదా బలమైన కారణం ఇంకా ఏమైనా ఉందా..? అనే కోణంలో విచారణ చేపడుతామని పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్ వెల్లడించారు.