మీరు బస్సెక్కినప్పుడు చేతిలో నగదు లేదా..? మొబైల్ ఫోన్, డెబిట్, క్రెడిట్ కార్డులు మాత్రమే ఉన్నాయా..? అయినా బస్సు దిగాల్సిన అవసరం లేదు. ఇకపై ఆర్టీసీ కరీంనగర్ రీజియన్లో క్యాష్లెస్ సేవలు ప్రారంభం కానున్నాయి. క్యూఆర్ కోడ్తో యూపీఐ పేమెంట్స్ స్వీకరించడమే కాకుండా, బస్సుల్లో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసి డెబిట్, క్రెడిట్ కార్డులతో టికెట్లు కొనే సదుపాయాలు రానున్నాయి. కరీంనగర్ రీజియన్ పరిధిలోని రాజధాని, గరుడ సర్వీసుల్లో ప్రయోగాత్మకంగా నగదు రహిత టికెట్లు ఇచ్చేందుకు రీజినల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సిబ్బంది శిక్షణ పూర్తయిన తర్వాత ఈ నెల 25 నుంచి రీజియన్ పరిధిలోని 22 సర్వీసుల్లో ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆర్టీసీ ఆర్ఎం ఖుస్రోషా ఖాన్ వెల్లడించారు.
కరీంనగర్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే సరిపడా చిల్లర డబ్బులు తప్పనిసరి. అయితే చాలా మంది చేతిలో సరిపడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటారు. చిల్లర కోసం వెంపర్లాడటం, కండక్టర్ చిల్లర లేదనడం, టికెట్కు సరిపడా డబ్బులు ఇవ్వాలని చెప్పడం, పెద్ద నోట్లు ఇచ్చి దిగిపోగా చిల్లర మరచి పోవడం ప్రయాణికులు ఎదుర్కొనే సర్వ సాధారణ సమస్యలు.
ఇవన్నింటికీ చెక్ పెడుతూ తెలంగాణ ఆర్టీసీ తమ బస్సు సర్వీసుల్లో నగదు రహిత టికెట్ కొనుగోలు విధానాన్ని తెస్తోంది. టికెట్ కోసం సరిపడా డబ్బులు ఉన్నాయా? లేవా? అని చూసుకోవాల్సిన అవసరం లేకుండా బ్యాంక్ అకౌంట్తో అనుసంధానమైన మొబైల్ ఫోన్తోపాటు డెబిట్, క్రెడిట్ కార్డులతో ఎక్కడికైనా ప్రయాణించే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్లోని బస్పాస్ కేంద్రాల్లో ఆర్టీసీ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపుల విధానాన్ని అమలులోకి తెచ్చి విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ అనుభవాల దృష్ట్యా ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ విధానాన్ని ప్రవేశ పెడితే సత్ఫలితాలు వస్తాయని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ముందుగా ప్రయోగాత్మకంగా దూర ప్రాంతాలకు వెళ్లే రాజధాని, గరుడ సర్వీసుల్లో క్యాష్లెస్ సేవలను ప్రవేశ పెడుతున్నారు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 ఆర్టీసీ డిపోల పరిధిలోని 6 గరుడ, 16 రాజధాని సర్వీసుల్లో ముందుగా అమలు చేయనున్నారు. సిస్టం సూపర్వైజర్లకు ఇప్పటికే హైదరాబాద్లో శిక్షణ కూడా ఇచ్చారు. వీరు ప్రస్తుతం రాజధాని, గరుడ సర్వీసులు ఉన్న డిపోల్లోని కండక్టర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 24 వరకు శిక్షణ ఇచ్చి 25 నుంచి ఈ రెండు సర్వీసుల్లో నగదు రహిత టికెట్ సేవలను ప్రారంభిస్తున్నారు.
నగదు రహిత టికెట్లు ఇచ్చేందుకు ఆర్టీసీ ఇప్పటికే కసరత్తు చేసింది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో ప్రయోగాత్మకంగా చేపడుతున్న రాజధాని, గరుడ సర్వీసులకు టిమ్స్ మిషన్లతోపాటు ఈ-పాస్ మిషన్లు కూడా ఇస్తున్నారు. రీజియన్ పరిధిలో మొత్తం 22 సర్వీసుల్లో మొదట ఈ సేవలు అందిస్తారు. డిపోల వారీగా చూసుకుంటే గరుడ సర్వీసులు కరీంనగర్-1లో 4, గోదావరిఖనిలో 2 ఉన్నాయి. రాజధాని సర్వీసులు కరీంనగర్-1లో 6, గోదావరిఖనిలో 5, జగిత్యాలలో 3, కోరుట్లలో 2 ఉన్నాయి.
ఈ నెల 25 నుంచి వీటిలో రెండు రకాల సేవలు అందుబాటులోకి తెస్తున్నారు. టికెట్కు సరిపడా డబ్బులు ఇచ్చిన వారికి టిమ్స్ మిషన్తో టికెట్లు ఇస్తారు. నగదు లేకుంటే క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ సిస్టంలో బ్యాంకు అకౌంట్తో అనుసంధానమై ఉన్న మొబైల్ ఫోన్తో ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లించి టికెట్ కొనుక్కునే అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి సర్వీసులో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా టికెట్ కొనుక్కోవచ్చు.
ఆర్టీసీలో నగదు రహిత సేవలు అందుబాటులోకి రావడం సంతోషించాల్సిన విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్కరణలు తెచ్చి ఆర్టీసీని గట్టెక్కించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు నగదు రహిత సేవలను అందుబాటులోకి తేవడం వల్ల రూపాయి చేతిలో లేకున్నా ప్రయాణికులు ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే మా సంస్థలోని సిస్టం సూపర్వైజర్లకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. వాళ్లు రాజధాని, గరుడ సర్వీసులు ఉన్న డిపోల్లోని డ్రైవర్లు, కండక్టర్లకు శిక్షణ ఇస్తున్నారు. 24 వరకు శిక్షణ ఉంటుంది. 25 నుంచి రీజియన్ పరిధిలోని 22 సర్వీసుల్లో మొదట ఈ-సేవలను ప్రారంభిస్తున్నాం. మిగతా బస్సుల్లోనూ ఇదే పద్ధతిని ప్రవేశ పెట్టే విషయం సంస్థ చేతిలోనే ఉంటుంది. ఎప్పుడు ప్రారంభించమంటే అప్పుడు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంటాం.
– ఖుస్రోషాఖాన్, ఆర్టీసీ ఆర్ఎం (కరీంనగర్ రీజియన్)