కరీంనగర్ రూరల్, ఆగస్టు 18: చల్మెడ వైద్యశాలలో క్లిష్టమైన సబ్ డ్యూరల్ హెమటోమా శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ అసీమ్ అలీ తెలిపారు. గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామానికి చెందిన లింగమ్మ (94) అనే వృద్ధురాలు వారం క్రితం చేయి, కాలు మాట పడిపోయి ప్రాణాపాయస్థితికి చేరువ కాగా, కుటుంబ సభ్యులు చల్మెడ ఆనందరావు వైద్యశాలలో చేర్పించారని తెలిపారు.
వృద్ధురాలిని న్యూరో సర్జన్ విభాగం వైద్యులు పరీక్షించి వివిధ రకాల పరీక్షలు నిర్వహించగా, మెదడు మధ్య నుంచి రక్త స్రావం జరిగినట్లు తేలిందని చెప్పారు. సబ్ డ్యూరల్ హెమటోమా శస్త్ర చికిత్సను న్యూరో సర్జన్ డాక్టర్ చందా శ్రీనివాస్ రావు బృందం, అనస్తీషియాలజీ బృందం వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు.
శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన ఆయా బృందాలతోపాటు లింగమ్మ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన ప్రొఫెసర్ డాక్టర్ అసీమ్ అలీ, అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు డాక్టర్ చాడ శిరీష, డాక్టర్ త్రివిక్రమ్ను వైద్య కళాశాల యాజమాన్యం చల్మెడ ఆనందరావు, వైద్య కళాశాల చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు, వైద్యకళాశాల డైరెక్టర్ డాక్టర్ వీ సూర్యనారాయణరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బందితోపాటు తదితరులు పాల్గొన్నారు.