కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. జిల్లాలో దేశభక్తిని చాటేలా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని, స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుని, వారి ఆశయాలను నెరవేర్చడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు
సీఎం కేసీఆర్ కృషితోనే రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తున్నదని చెప్పారు. సోమవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. కొత్తగా అందించే ఆసరా పెన్షన్లను పంపిణీ చేశారు. ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించి గౌరవించారు. ఈ సందర్భంగా మంత్రి చేసిన సుదీర్ఘ ప్రసంగం ఆయన మాటల్లోనే..
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేశాం. గాంధీజీ సినిమాను అన్ని థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించాం. ఫ్రీడం ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలు నిర్వహించాం. సామూహిక జాతీయ గీతాలాపన, క్రీడలు, రంగోళి, రక్తదాన శిబిరాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ఎందరో మహానుభావుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. వారు చూపిన మార్గంలో పయనిస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలి.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరందిస్తున్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ను ఇస్తున్నాం. రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు ప్రవేశ పెట్టి రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం. రైతుబంధు కింద ఈ వానకాలం సీజన్లో జిల్లాలో 1,81,725 మంది రైతులకు రూ.177.67 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించాం. ఇప్పటివరకు 456 మంది రైతులు మరణించగా 401 మంది కుటుంబాలకు రైతు బీమా కింద రూ.20.05 కోట్లు అందించాం. 2021-22 యాసంగిలో 337 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3.27 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశాం. వానకాలం సాగుకు అవసరమైన రూ.2.60 కోట్ల విలువైన 6,297 క్వింటాళ్ల విత్తనాలు అందించాం. 73,682 మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచాం.
జిల్లాలోని 94,874 వ్యవసాయ బావులు, బోర్లకు 24 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నాం. ఇందుకోసం ఏటా రూ.100 కోట్లకుపైగా సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. ప్రతి వినియోగదారుడికి కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ను అందించేందుకు జిల్లాలోని లక్ష్మీపూర్లో ఒక 400/220 కేవీ, దుర్షేడులో రెండు 220/132 కేవీ, బొమ్మకల్లో ఒక 220/66 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. జిల్లాలో తొమ్మిది 132/33 సబ్స్టేషన్లను ఏర్పాటు చేశాం. 33/11 సబ్స్టేషన్లు 92 ఏర్పాటు చేశాం. విద్యుత్ లైన్ల బలోపేతానికి కొత్తగా 735 కిలో మీటర్ల వరకు 33 కేవీ లైన్లు, 4,100 కిలో మీటర్ల వరకు 11 కేవీ లైన్లు, 12,264 కిలో మీటర్ల వరకు ఎల్టీ లైన్లు, 548 కిలో మీటర్ల వరకు 6.3 కేవీ లైన్లు ఏర్పాటు చేశాం. జిల్లాలో విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు రూ.49కోట్లతో కొత్త సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.
తాగునీటి కోసం మహిళలు పడుతున్న కష్టాలను దూరం చేసేందుకు మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. జిల్లాలోని 494 ఆవాస ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు రూ.1,492 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 22 కట్టడాలు, 1,232 కిలో మీటర్ల పైప్లైన్ నిర్మాణం పూర్తి చేశాం. జిల్లాలోని 494 ఆవాసాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నాం.
దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నాం. వివిధ ఉపాధి యూనిట్ల కోసం ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఉచితంగా ఇస్తున్నాం. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. హుజూరాబాద్లో 17,840 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రూ.1,766.16 కోట్లను వారి ఖాతాల్లో జమచేశాం. ఇప్పటివరకు 15,373 మంది లబ్ధిదారులకు గ్రౌండింగ్ చేశాం. ఇందులో 213 మందికి వ్యవసాయ అనుబంధ, 2,415 మందికి డెయిరీ, 8,356 మందికి ట్రాన్స్పోర్టు, 130 మాన్యుఫ్యాక్చరింగ్, 1,937 రిటైల్ షాపులు, 2,322 సర్వీస్, సప్లయ్ యూనిట్లను అందించాం. నియోజరవ్గంలోని నాలుగు మండలాల్లో 1,623 మంది లబ్ధిదారులకు 6,492 పాడిగేదెలను పంపిణీ చేశాం.
చేనేత కార్మికుల కోసం నూలు, రసాయనాల కొనుగోలుపై 40శాతం రాయితీ ఇస్తున్నాం. రైతు బీమా తరహాలో నేతన్న బీమా పథకాన్ని ప్రవేశ పెట్టాం. అన్ని మరమగ్గాలకు 50 శాతం రాయితీపై విద్యుత్ను సరఫరా చేస్తున్నాం. జిల్లాలో 19 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.3.47 కోట్ల క్యాష్ క్రెడిట్ రుణాలు మంజూరు చేశాం.
మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం. చేపల పెంపకానికి అవసరమయ్యే పెట్టుబడిని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. లాభాలను మాత్రం మత్స్యకారులకు ఇస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 11,173 టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యం కాగా ఇంతవరకు 6,037 టన్నుల ఉత్పత్తి జరిగింది. 466 టన్నుల రొయ్యల ఉత్పత్తి లక్ష్యం కాగా ఇప్పటివరకు 255 టన్నుల ఉత్పత్తి జరిగింది. మత్స్యకారులకు ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు, అంగవైకల్యం పొందితే రూ.లక్ష చెల్లిస్తున్నాం.
గొల్ల, కుర్మలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సబ్సిడీపై గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నాం. ఈ పథకం కింద గత రెండు విడతల్లో 13,439 మంది లబ్ధిదారులను గుర్తించి ఇప్పటివరకు 3,586 మందికి గొర్రెలు పంపిణీ చేశాం. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 4 సంచార పశువైద్య శాలలను ఏర్పాటు చేసి రైతుల ఇంటివద్దకు వెళ్లి పశువులకు అత్యవసర సేవలందిస్తున్నాం.
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పంచాయతీరాజ్ శాఖ ప్రవేశ పెట్టిన మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షణ జరిపి డీపీవో, డివిజనల్, మండల స్థాయి పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీల రికార్డులను నిత్యం తనిఖీ చేస్తున్నారు. 2021-22 సంవత్సరానికి రామగుడు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ దీన్ దయాల్ ఉపాధ్యాయ సశక్తి కరణ్ పురస్కారానికి ఎంపికైంది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను గత జూన్లో నిర్వహించి డెంగీ, మలేరియా తదితర వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాం.
తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 2.76 కోట్ల మొక్కలు నాటాం. 2022లో 47.08 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. మొక్కల సంరక్షణకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామానికో నర్సరీ, పల్లె ప్రకృతి వనం, ప్రతి మండలానికో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశాం.
జిల్లాకు రూ.150 కోట్లతో మెడికల్ కళాశాల మంజూరైంది. 100 మెడికల్ సీట్లతో తరగతులు నిర్వహించేలా జిల్లా జనరల్ దవాఖానను అప్గ్రేడ్ చేశాం. జిల్లాలో కొవిడ్ వైరస్ను కట్టడి చేయగలిగాం. కరీంనగర్ ప్రధాన దవాఖానలో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా ప్రతిరోజూ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇదే దవాఖానలో 21కేఎల్ సామర్థ్యంగల ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశాం. జిల్లాలో కరోనా నియంత్రణకు 19,26,260 మందికి వ్యాక్సిన్ వేశాం. జిల్లాలో వంద శాతానికిపైగా టీకాలు వేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసించింది. కొవిడ్ వ్యాక్సినేషన్ను సమర్థవంతంగా నిర్వహించిన ఐదు పీహెచ్సీలకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకాలు లభించాయి.
బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కూడా వేగవంతంగా జరుగుతున్నది. మంకీ ప్యాక్స్కు కూడా ప్రభుత్వ దవాఖానల్లో చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో సేవలందిస్తున్నాం. 150 పడకలతో ఎంసీహెచ్ ఏర్పాటు చేశాం. నెలకు 800-900 కాన్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 49,859 కేసీఆర్ కిట్లు అందించాం. మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు, ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేలు ఇస్తున్నాం.
పేదల ఆకలి తీర్చేందుకు జిల్లాలో ఇప్పటివరకు 2,64,087 ఆహార భద్రత కార్డులు జారీ చేశాం. 15,783 కుటుంబాలకు అంత్యోదయ కార్డులు, 39 కుటుంబాలకు అన్నపూర్ణ కార్డులిచ్చాం. ఆగస్టు నుంచి యూనిట్కు 15 కిలోలు, అంత్యోదయ కార్డుపై 35 కిలోలతోపాటు 10 కిలోల చొప్పున అదనంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం.
ఉపాధిహామీ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 19,23 వేల పనిదినాలు కల్పించాం. 78,527 మంది కూలీలకు రూ.29.03 కోట్లు, మెటీరియల్ కంపోనెంట్ కింద రూ.14 కోట్లు చెల్లించాం. మహిళలకు బ్యాంకు లింకేజీ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.160 కోట్లు ఇచ్చాం. స్త్రీ నిధి ద్వారా 500 సోలార్ యూనిట్లు నెలకొల్పుకునే అవకాశం కల్పించాం. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, బీడీ, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు 1,15,995 ఆసరా పెన్షన్లు అందిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంప్లాయిమెంట్ జనరేషన్, మార్కెటింగ్ మిషన్ ద్వారా 770 మందికి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చాం. 674 మందికి వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి కల్పించాం.
జిల్లాలో తల్లిదండ్రులు లేని 32 మంది అనాథ పిల్లలకు బాలల సంరక్షణ కేంద్రంలో విద్య, వసతి కల్పిస్తున్నాం. నిరాదరణకు గురైన 255 మంది అనాథ బాలికలను గుర్తించి వారికి వసతి కల్పిస్తున్నాం. పేదలకు 6,494 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా, ఇందులో 4,907 ఇండ్లు అగ్రిమెంట్ పూర్తయ్యాయి. 789 ఇండ్లు నిర్మించగా, మరో 276 ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయి.
రోడ్లు భవనాల శాఖ ద్వారా జిల్లాలో సింగిల్ లైన్ రోడ్లను డబుల్ లైన్లుగా మార్చేందుకు రూ.225 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులన్నీ ప్రగతిలో ఉన్నాయి. ఆర్డీఎఫ్ కింద 116 కిలో మీటర్ల రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.162 కోట్లు మంజూరు చేసింది.
పనులు చివరి దశకు చేరాయి. జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్టీ) నుంచి రూ.82 కోట్లతో 35 రోడ్లను పునరుద్ధరిస్తున్నాం. జిల్లా కేంద్రంలో రూ.51 కోట్లతో నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 5,248 రోడ్ల అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.351కోట్లు మంజూరు చేసింది. ఇందులో 2,727 పనులు పూర్తికాగా మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నాయి. ప్రధాన మంత్రి సడక్యోజన కింద రూ. 30.89 కోట్లు మంజూరుకాగా 12 తారు రోడ్డు పనులు చేపట్టాం. మినరల్ ఫండ్ ద్వారా 2,040 రోడ్ల పనులకు రూ.160.97 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో 1,616 పనులు పూర్తయ్యాయి.
పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఇప్పటి వరకు రూ.287.10 కోట్ల పెట్టుబడితో 28 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేశాం. వీటి ద్వారా 266 మందికి ఉపాధి లభిస్తున్నది. పీఎంఈజీ ద్వారా రూ.2.24 కోట్ల మార్జిన్ మనీతో 77 పరిశ్రల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు రూ.27.68 లక్షలతో 11 పరిశ్రమలు ఏర్పాటు చేశాం. టీ ఫ్రైడ్ పథకం ద్వారా 17 పరిశ్రమల స్థాపనకు రూ.3.70 కోట్ల పెట్టుబడి రాయితీ, పావులా వడ్డీ కింద మంజూరు చేశాం. 42 మంది ఎస్సీ అభ్యర్థులకు రూ.2.45 కోట్లు, ఆరుగురు ఎస్టీ అభ్యర్థులకు రూ.13.48 లక్షలు, దివ్యాంగులకు రూ.31.42 లక్షల పెట్టుబడి రాయితీ మంజూరు చేశాం.
కరీంనగర్ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరి భాగస్వామ్యం అవసరం. ఈ ప్రాజెక్టులో భాగంగా నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. రహదారులు, డ్రైనేజీలు, స్టాం వాటర్ డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం రూ.520 కోట్లు మంజూరు చేశాం. పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం ఆధునీకరణ పనులు పూర్తి చేశాం.
అన్ని ప్రధాన జంక్షన్లలో అభివృద్ధి, సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. రూ. 648 కోట్లతో 24 గంటల తాగు నీటి సరఫరా పనులు మంజూరు చేశాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు, బయోమైనింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టం, డిజిటల్ లైబ్రరీ నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికల వసతుల కల్పన, స్మార్ట్ క్లాస్ రూంల ఏర్పాటు వంటి పనులు మంజూరు చేశాం. రూ.56 కోట్లతో ఆధునిక టాయిలెట్ల, ఓపెన్ జిమ్లు, శ్మశాన వాటికలు, పార్కులు, వాకింగ్ ట్రాక్ల నిర్మాణం పూర్తి చేశాం.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం కోసం ఇరిగేషన్ కార్యాలయం వద్ద రూ.14.50 కోట్లు, పద్మనగర్లో రూ.10 కోట్లు, కశ్మీర్గడ్డలో రూ.10 కోట్లు, కిసాన్నగర్లో రూ.5.80 కోట్లు కేటాయించాం. రూ.4 కోట్లతో మానేరు, అల్కాపురి వద్ద శ్మశాన వాటికలను అభివృద్ధి చేశాం. రూ.12.50 కోట్లతో ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద అమృత వర్షిణి ఆడిటోరియం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మానేరు రివర్ ఫ్రంట్ పనులకు రూ.410 కోట్లతో విశాలమైన పచ్చిక బయళ్లు, యోగా కేంద్రాలు, వాటర్ స్పోర్ట్స్, బోటింగ్, లేజర్ షో, అతిథి గృహాలు నిర్మిస్తున్నాం.
ఈ వేడుకల్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్లాల్, గరిమా అగర్వాల్, సీపీ సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, నగర మేయర్ వై సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.