వజ్రోత్సవం అంబరాన్నంటుతున్నది. ఊరూరా ఉత్సాహంగా సాగుతున్నది. మూడో రోజు బుధవారం మండలకేంద్రాలు, మున్సిపాలిటీల్లో వన మహోత్సవం కనుల పండువను తలపించింది. ఆయాచోట్ల ఫ్రీడం పార్కులు ఏర్పాటు చేయడంతోపాటు 75 సంఖ్య ఆకృతిలో మొక్కలను నాటారు. కరీంనగర్తోపాటు కొత్తపల్లిలో మంత్రి గంగుల కమలాకర్, తిమ్మాపూర్, మానకొండూర్లో రసమయి బాలకిషన్, రామడుగులో సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. మంత్రితో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్లో గాంధీ చిత్రాన్ని వీక్షించారు. ఇంటింటికీ జెండాలు పంపిణీ కొనసాగుతుండగా, నేడు అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఫ్రీడం రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): వజ్రోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. విద్యార్థులు, ప్రజల్లో దేశభక్తి నింపేలా థియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్నారు. అలాగే ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇంటింటికీ జాతీయ జెండాలు పంపిణీ చేస్తున్నారు. నేడు అన్ని మండలాలు, పట్టణాలలో ఫ్రీడం రన్ నిర్వహించనుండగా, మూడో రోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవం నిర్వహించారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి, ఫ్రీడం పార్కులు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కరీంనగర్లో విస్తృతంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కును మంత్రి గంగుల, వినోద్కుమార్ ప్రారంభించారు. అనంతరం కొత్తపల్లిలో కూడా ఫ్రీడం పార్కులో మంత్రి మొక్కలు నాటారు.
అనంతరం స్థానిక మల్టీఫ్లెక్సీ థియేటర్లో మంత్రి గంగుల, వినోద్కుమార్, మేయర్ వై సునీల్ రావు, సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తదితరులు గాంధీ సినిమాను విద్యార్థులతో కలిసి తిలకించారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో అధ్యాపక బృందం వజ్రోత్సవ స్ఫూర్తిని చాటుతూ ద్విసప్తాహ కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. తిమ్మాపూర్, మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రీ పంప్హౌస్ ఆవరణలో ఎమ్మెల్యే సుంకె మొక్కలు నాటారు. మానకొండూర్లోని బాలికల పాఠశాలలో, గన్నేరువరం మండలం జంగపల్లిలో, చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ జగిత్యాల టవర్ రంగురంగుల విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలుగులీనుతున్నది. మువ్వన్నెల జెండా రంగుల కాంతులతో సరికొత్త అందాలను అద్దుకొని చూపరులను ఆకట్టుకుంటున్నది.
– జగిత్యాల ఫొటోగ్రాఫర్