మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సరికొత్త కార్యక్రమాలతో ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, తాజాగా ఏడో విడత నీలి విప్లవానికి సిద్ధమైంది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ముందుగానే చేప పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించగా, అందుకు అనుగుణంగా అధికారయంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. గతేడాది సిరిసిల్ల జిల్లాలోని 392 చెరువులు, మూడు ప్రాజెక్టుల్లో 1.19కోట్ల పిల్లలను వేయగా, ఈ యేడు అనూహ్యంగా 403 చిన్ననీటి వనరులు, కుంటలు సహా ఎస్సారార్, అన్నపూర్ణ రిజర్వాయర్లు, ఎగువమానేరు ప్రాజెక్టుల్లో 1.32కోట్ల ‘బొచ్చె, రవ్వులు, బంగారు తీగ) రకం విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడో, రేపో వదలనుండగా, మత్స్యకార కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది. అందులో భాగంగా ఏడో విడుత నీలి విప్లవానికి శ్రీకారం చుడుతున్నది. జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టుల్లో విత్తన చేప పిల్లలను వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించి, టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. సర్కారు కాళేశ్వర జలాలను తెచ్చి జిల్లాలో వ్యవసాయం పండుగలా మార్చి అన్నదాతలకు సిరి సంపదలను తెచ్చింది.
మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ఎగువ, రాజరాజేశ్వర, అన్నపూర్ణ జలాశయాలను మత్స్య సంపదకు కేంద్ర బిందువుగా తీర్చిదిద్దింది. ఆరు విడుతల్లో చేపట్టిన నీలి విప్లవం ద్వారా జిల్లాలోని దాదాపు 10 వేల పైచిలుకు మత్స్య కార్మిక కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవే. గతంలో జిల్లాలో చేపలను పెంచాలంటే మత్స్య కార్మికులే రాయలసీమ, ఆంధ్ర నుంచి విత్తన చేపలు కొనుక్కొచ్చుకొని, చెరువుల్లో వేసుకునే వారు. దూరంతో పాటు ఖర్చులు కూడా భారం కావడంతో కొద్ది మందికి మాత్రమే ఉపాధి దొరికేది.
పైగా కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం, నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు వెళ్లి చేపలు కొనుగోలు చేసి, జిల్లాలో అమ్ముకునే వారు. కానీ రాష్ట్ర సర్కారు తెచ్చిన నీలి విప్లవంతో జిల్లాలోని చెరువులన్నీ చేపల ఉత్పత్తి కేంద్రాలుగా మారి, వేలాది మందికి ఉపాధి లభిస్తున్నది. కాగా, మత్స్య కారులకు ఉపాధి కల్పించడమే కాదు చేపలు అమ్ముకునేందుకు వీలుగా ఐఎఫ్డీఎస్ (సమీకృత మత్స్య అభివృద్ధి పథకం) కింద వలలు, బైకులు, నాలుగు చక్రాల వాహనాలను సబ్సిడీపై అందిస్తూ ప్రోత్సహిస్తున్నది.
జిల్లాలోని జలాశయాలు చేపల ఉత్పత్తికి కేంద్రాలుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీలి విప్లవంతో చేపల పెంపకం బాగా పెరిగింది. శ్రీరాంసాగర్ వరద కాలువ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాజరాజేశ్వర ప్రాజెక్టులోకి వస్తున్న నీటితో రకరకాల చేపలు వస్తున్నాయి.
పాపెర్లు, బొచ్చెలు, బంగారు తీగలు, రవ్వులు, బొమ్మెలు, రొయ్యలు, 10 నుంచి ఇరవై కిలోలకు పైగా బరువున్న చేపలు మత్స్యకారుల వలలకు చిక్కుతున్నాయి. నీలి విప్లవంతో జిల్లా ప్రజలకు అన్ని రకాల చేపలు అందుబాటులో లభిస్తున్నందుకు సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మత్స్య సంపదను పెంచి కార్మిక కుటుంబాలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నీలి విప్లవాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ఆరు విడుతలుగా ఉచితంగా చేప విత్తనాలు పంపిణీ చేసి మత్స్య సంపదను అనూహ్యంగా పెంచింది. ఒకప్పుడు జిల్లాలో 78 మత్స్యకార సంఘాలు, 4016 మంది సభ్యులే ఉండేవారు. కానీ సర్కారు చేపట్టిన చర్యలతో 99 సంఘాలకు విస్తరించగా, సభ్యుల సంఖ్య 7,105 మందికి పెరిగింది.
2016-17 సంవత్సరంలో 92 చెరువుల్లో 30.5లక్షల చేపపిల్లలు వదలగా, ఈ యేడాది 403 చెరువులు, మూడు ప్రాజెక్టుల్లో 1.32 కోట్ల చేపపిల్లలు వదలాలని జిల్లా మత్య్స శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో ఒక్క రాజరాజేశ్వర జలాశయంలోనే 25.50 లక్షలు, ఎగువ మానేరులో 10.50 లక్షలు, అన్నపూర్ణ జలాశయంలో 6.50 లక్షల పిల్లలు వదలనున్నారు. ప్రధానంగా బొచ్చె, రవ్వులు, బంగారు తీగ రకం వేయాలని నిర్ణయించారు. కాగా, గతేడాది 392 చెరువుల్లో 1.19 కోట్ల పిల్లలను వదలగా, పెరిగిన కార్మిక సంఘాలు, సభ్యులకు అనుగుణంగా ఉపాధి కల్పించేందుకు చేపపిల్లల సంఖ్యను ఈ యేడు పెంచింది.