కరీంనగర్ విద్యానగర్, ఆగస్టు 10: తపాలశాఖ ప్రైవేటీకరణపై పోస్టల్ ఉద్యోగులు భగ్గుమన్నారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. జిల్లాకేంద్రాల్లోని తపాలశాఖ కార్యాలయాల ఎదుట సమ్మెకు దిగారు. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.
వీరి సమ్మెకు పెన్షనర్లు, చిన్న మొత్తాల పొదుపు సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమ్మెలో ఉద్యోగులను ఉద్దేశించి వివిధ యూనియన్ల నాయకులు మాట్లాడారు. అన్నివర్గాల ప్రజలతో అనుబంధం ఉన్న పోస్టల్ శాఖ ప్రైవేటీకరణను నిలిపివేయాలని, పోస్టల్ ఖాతాలను పేమెంట్ బ్యాంక్కు బదిలీ చేయవద్దని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైల్వే మెయిల్ సర్వీసెస్ను యథావిధిగా కొనసాగించాలని, పోస్టల్ ఇన్స్యూరెన్స్ను పోస్టల్ శాఖలోనే కొనసాగించాలని, జీడీఎస్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, డీఆర్, డీఏను వెంటనే విడుదల చేయాలన్నారు.
కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంఘం కార్యదర్శులు ఏ రామచంద్రం, అనిల్, సుధాకర్ గార్ల అధ్యక్షతన జరిగిన ఈ సమ్మెలో పోస్ట్మాస్టర్లు ఫజుల్ రెహమాన్, ఏ రమేశ్, మల్లేశం, పవన్ కుమార్, రాజ్ కుమార్, గంగయ్య, సతీశ్, మహేశ్, కన్నయ్య, స్వామి, చక్రపాణి, దిలీప్, రాజు, కృష్ణకాంత్, అభిషేక్, మనోహర్, అనూష, సదయ్య, గంగయ్య, వీణశ్రీ, శ్రీకాంత్, శివ, వేణు, ఎల్లయ్య, చిన్న మొత్తాల పొదుపు సంఘం ప్రతినిధులు, కృష్ణకిశోర్, పెన్షనర్ల సంఘం నాయకుడు లక్ష్మీపతి, నర్సింగరావు, సీఐటీయూ నాయకులు ఎడ్ల రమేశ్ ఉన్నారు.