గతేడాదితో పోల్చితే ఈసారి వానకాలంలో వ్యవసాయ అధికారులు వరి విస్తీర్ణాన్ని తగ్గించి, ఇతర పంటలను పెంచి ప్రణాళికను సిద్ధం చేశారు. వానకాలం ప్రణాళికలో వరికే సింహ భాగం ఇచ్చినా నిరుటి కంటే ఈసారి 27,549 ఎకరాలు తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇతర పంటల్లో పత్తి విస్తీర్ణాన్ని 60 వేలకు, మక్కజొన్న విస్తీర్ణాన్ని 25 వేల ఎకరాలకు ప్రణాళికలో ఖరారు చేశారు. పెసర, కంది, మిరప, పసుపు, తదితర పంటల విస్తీర్ణాన్ని కూడా ఈసారి గణనీయంగా పెంచారు. ఈ విషయమై రైతు వేదికల్లో రైతులకు ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన అధికారులు, వర్షాలు అనుకూలించగానే పంటల సాగుకు సన్నద్ధ్దం చేయనున్నారు.
కరీంనగర్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : వానకాలం సీజన్లో వరి విస్తీర్ణాన్ని తగ్గించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. వరికి బదులు ఇతర పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏప్రిల్, మే నెలలో జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఈ దిశగా సంసిద్దులను చేసిన వ్యవసాయ శాఖ, ఇప్పుడు ఇతర పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. జిల్లాలోని పలు మండలాల్లో ఇప్పటికే రైతులు దుక్కులు దున్నుకుని పత్తి సాగుకు సిద్ధమవుతున్నారు. కొందరు రైతులు విత్తుకున్నారు.
వర్షాలు సమృద్ధిగా కురిసిన తర్వాతే పంటలు సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈసారి 2.45 లక్షల ఎకరాల్లో వరి సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గతేడాది ఇదే సీజన్లో 2,72,549 ఎకరాల్లో వరి సాగవగా, అప్పటితో పోల్చుకుంటే ఇప్పడు 27,549 ఎకరాలు తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. ఇక నిరుడు కేవలం 5,906 ఎకరాల్లో మాత్రమే సాగైన మక్కజొన్న పంటకు అధికారులు ప్రోత్సహిస్తూ ఈసారి 25 ఎకరాలకు పెంచారు. అలాగే, 47,062 ఎకరాల్లో సాగైన పత్తిని ఈసారి 60 వేల ఎకరాలకు పెంచారు.
278 ఎకరాల్లో సాగైన పెసరను 1,500, 2,680 ఎకరాల్లో సాగైన కందిని 5 వేలు, 74 ఎకరాల్లో సాగైన పసుపును 150, 166 ఎకరాల్లో సాగైన మిరపను 800, 293 ఎకరాల్లో సాగైన పల్లిని 300, 74 ఎకరాల్లో సాగైన పొగాకును 100 ఎకరాలకు పెంచారు. మరో ఐదెకరాల్లో మినుము, 45 ఎకరాల్లో మిగిలిన పంటల చొప్పున మొత్తం 3,37,900 ఎకరాల్లో ఈసారి పంటలు పండించేందుకు జిల్లా వ్యవసాయ అధికారులు వానకాలం పంటల ప్రణాళికను ఖరారు చేశారు.
సాగు ప్రణాళికకు అనుగుణంగా జిల్లా వ్యవసాయ అధికారులు విత్తనాలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే పచ్చి రొట్ట ఎరువుల కింద 131.2 క్వింటాళ్ల జనుము, 6 వేల క్వింటాళ్ల జీలుగ విత్తనాలను రైతుల కోసం అందుబాటులో ఉంచారు. ఇందులో 87.6 క్వింటాళ్ల జనుము, 3,978.9 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. చాలా మంది ఇప్పటికే వీటిని సాగు చేసుకున్నారు. ఈ విత్తనాలను సబ్సిడీపై అందిస్తున్న నేపథ్యంలో చాలా మంది పచ్చి రొట్ట విత్తనాలను కొనుగోలు చేసుకుంటున్నారు.
సబ్సిడీయేతర విత్తనాలు కూడా అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా అన్ని కంపెనీలకు సంబంధించిన పత్తి విత్తనాలు మార్కెట్లో ఉన్నాయి. వరిలో తెలంగాణ సాంబ (ఆర్ఎన్ఆర్ 15048), బీపీటీ 5204, ఎంటీయూ 1010, కేఎన్ఎం 118, ఎంజీజీ 295 పెసర విత్తనాలు, ఐసీపీఎల్ 87119 కంది విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారు. వరి 25 కిలోల సంచికి రూ.850, పెసర 4 కిలోల సంచికి రూ.418.80, కందులు 4 కిలోల సంచికి రూ.401.20 చొప్పున ధరలు నిర్ణయించారు.
వానకాలం పంటలకు సరిపడా ఎరువులను అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటి నుంచి సెప్టెంబర్ వరకు అవసరమైన ఎరువులకు ఇండెంట్ ఇచ్చారు. ఇందులో ఎక్కువ శాతం ఎరువులు జిల్లాలో నిలువకు ఉన్నాయి. ముఖ్యంగా యూరియా ఈ సీజన్కు 42,025 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా 21,392 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది.
డీఏపీ 6,806 మెట్రిక్ టన్నులకు 4,416 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 26,236 మెట్రిక్ టన్నులకు 25,405 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 10,852 మెట్రిక్ టన్నులకు 1,025 మెట్రిక్ టన్నుల చొప్పున సీజన్లో 85,919 మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరానికి 52,237 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ వానకాలం సీజన్లో రైతులకు ఏ కొరతా రానీయకుండా చర్యలు తీసుకుంటున్నాం. వర్షాలు అనుకూలించిన తర్వాతనే పంటలు సాగు చేయడం మంచిది. ముఖ్యంగా పత్తి విత్తుకునే రైతులు 60-70 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తుకోవాలి. అన్ని రకాల కంపెనీల పత్తి విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఆమోదించిన విత్తనాలను మాత్రమే వాడాలని ఇది వరకే రైతులకు అవగాహన కల్పించాం.
ఇప్పటికే పచ్చి ఎరువుల కింద జనుము, జీలుగ విత్తనాలు అందుబాటులో ఉంచాం. చాలా మంది పొలాల్లో వేసుకున్నారు. వానకాలం ప్రణాళికలో గతేడాది కంటే వరిని తగ్గించాం. అయితే, విస్తీర్ణం తగ్గించేందుకు మా ప్రయత్నం మేం చేస్తున్నాం. మక్క, పల్లి, పత్తి పంటలను ప్రోత్సహిస్తూ ఈసారి వీటి విస్తీర్ణం పెంచాం. జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరతా ఉండదు. కావల్సినన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా యూరియా కొరత రాకుండా చూసుకుంటాం.
– వాసిరెడ్డి శ్రీధర్, కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి